కొనసాగుతున్న ట్రయల్న్
1856 గ్రామాలకు అందనున్న తాగునీరు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నిజాంసాగర్, ఏప్రిల్ 4: భగీరథ నీళ్లు ఇంటింటికీ వచ్చేందుకు పనులు పూర్తికావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎన్ఏ జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతుండడంతో సింగూరు నుంచి వచ్చే మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పనులకు ఆటంకం కలిగింది. దీంతో కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ ట్రయల్ రన్ కొనసాగుతోంది. పైపులైన్లు, ట్యాంకులను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ ద్వారా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 1856 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతేడాది విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండినప్పటికీ 1856 గ్రామాలకు నీటిని అందించలేకపోయారు. సంగారెడ్డి-నాందెడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పైపులైన్లను తొలగించడంతో ఆటంకం ఏర్పడి కొత్తగా పైపులైన్ వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు పూర్తికావడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాను ప్రారంభించనున్నారు. రెండు రోజుల నుంచి అధికారులు ట్రయల్న్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని ట్యాంకులను శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండాలని అధికారులు ఈ మేరకు ఆయా గ్రామాల సర్పంచులకు సమాచారం కూడా అందించారు. ప్రస్తుతం పైపులైన్లను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని, రెండు రోజుల్లో నిజాంసాగర్ మండలానికి భగీరథ నీటిని అందిస్తామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో మిగితా మండలాల్లోని గ్రామాలకు నీటిని అందిస్తామని చెప్పారు.