దేవరుప్పుల, ఏప్రిల్ 25: జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి గురువారం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది తమ అభిమాన నాయకుడి కోసం గంటల కొద్దీ ఎదురు చూసి బస్సు రాగానే పూల వర్షం కురిపించారు. యాదాద్రి భువనగిరిలో రోడ్షోకు దేవరుప్పుల మీదుగా బస్సులో కేసీఆర్ వెళ్తున్నారనే సమాచారంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు వందలాది నాయకులు, కార్యకర్తలు చేరుకొని కేసీఆర్కు భారీ స్వాగతం పలికారు.
బస్సుకు అడ్డుపడి కేసీఆర్ను చూసేందుకు ఎగబడ్డారు. మహిళా కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు. బసు అద్దం వద్దకు పోయి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీంతో కేసీఆర్ అద్దానికి చేయి ఆనించి కరచాలనం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లిని గమనించిన కేసీఆర్ నవ్వుతూ బస్సెక్కాలని సైగ చేశారు. దీంతో బస్సెక్కిన ఎర్రబెల్లి కేసీఆర్ పక్కన కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు. గంట వ్యవధిలో ఇంత మంది రావడంపై ఎర్రబెల్లిని కేసీఆర్ అభినందించినట్లు తెలిసింది. 10 నిమిషాల పాటు ఆగిన కేసీఆర్ బస్సు కదలడంతో రోడ్డు క్లియర్ అయింది.