జనగామ, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా.. కొందరు నేతలు ఎన్నికల్లో లబ్ధి కోసం మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణాల్లో పలువురి ఓట్లు నమోదు చేయించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రెండు ఓట్లు కలిగి ఉండడం నేరం కావ డంతో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో రెండు చోట్ల ఓటు ఉన్నవారిలో (డబుల్ ఓటర్లు) మెజార్టీ ఓటర్లు తమ స్వగ్రామంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకే ఇష్టపడినట్ల స్పష్టం అవుతున్నది.
రెండో చోట్లా ఓట్లు ఉన్నవారిలో చాలా మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) సొంతూరిలోనే ఓటు హక్కు ఉండేలా పల్లెల్లోనే ఎన్యూమరేషన్ ఫారాలను నమోదు చేశా రు. ఫలితంగా ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనున్నాయి. సర్ ప్రభావం జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై తీవ్రంగానే పడనుంది. సవరణ ప్రక్రియకు గడువు ముగిసే నాటికి ఆరు జిల్లాల్లో మొత్తం 30,53,238 ఓట్లకు గాను 26,76,641 ఓట్లకు మాత్రమే డిజిలైజేషన్ పూర్తయింది.
చనిపోయిన వారు, అందుబాటులో లేకపోవడం, వలసలు వెళ్లిన వారు, మరణించిన ఓటర్లు, రెండుచోట్ల ఓటర్లుగా నమోదైన వారు, తిరిగి ఫారాలను ఇవ్వలేకపోయిన వారు, డేటాలో తప్పులు, సందేహాలు వంటివి కలిపి మొత్తం 3,76,597 ఓట్లు డౌట్లో పడ్డాయి. వీటిలో మరణించిన వారు, వలసలు వెళ్లిన వారీగా భావిస్తు న్నవి 1.70 లక్షల ఓట్లు, వివరాల్లో తేడాలు ఉన్న ఓట్ల సంఖ్య 4,88,926 ఉన్నాయి. ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడి తర్వాత తేడాలున్న వారికి ఆధారాలు చూపేందుకు మరో అవకాశం ఇవ్వనుండగా, ఆ తర్వాతే ఔటయ్యే ఓట్లేన్ని? గల్లంతయ్యేవి ఎన్నో తుది జాబితాలోనే లెక్క తేలనుంది. ఒక్క జనగామ జిల్లాలోనే ఈ సంఖ్య 1,39,222 ఉండగా, వీరిలో 63,825 వేల మందికి అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్-2026 ప్రక్రియలో ప్రధానంగా డబుల్ ఓటర్ల ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతున్నది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినా.. మొదట్లో వాటిని ఎలా పూరించాలో తెలియక చాలా మందిలో గందరగోళం పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ఫారాలను తీసుకున్న వారు సైతం వాటిలో వివరాలు నమోదు చేయకుండా తమవద్దనే ఉంచుకున్నారు. వివరాలు సమర్పించినా ముసాయిదా జాబి తాలో పేరు లేనివారితోపాటు 2002 జాబితాతో మ్యాపింగ్ కాని వారితోపాటు మృతిచెందిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగిన, సమాచారం ఇవ్వనివారందరికీ త్వరలోనే నోటీసులు అందించనున్నారు.
అధికారులు కోరిన అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పంచని వారి ఓట్లు అనివార్యంగా తొలగిపోనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం 12 రకాల పత్రాల్లో ఏదైనా ఓటర్లు అందజేయాల్సి ఉంటుంది. చాలా నియోజ కవర్గాల్లో పేర్లలో తప్పులు దొర్లిన ఓటర్లుగా పరిగణించి 2002 ఓటరు జాబితాను ప్రామా ణికంగా తీసుకోనున్నారు. ఆ సమయంలో ఇంటి పేరు ముందుండి పేరు తర్వాత ఉన్న ఓటరు.. ప్రస్తుతం ఓటరు పేరు ముందుండి.. ఇంటి పేరు తర్వాత ఉన్నవారిని అనామలిస్ జాబితాలో చేర్చారు. అంతేకాకుండా 2002 జాబితాలో పేర్లు లేకపోవడంతో తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డు నంబరు ఆధారంగా చాలా మంది దరఖాస్తు చేసుకున్న వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలను నిరూపించే ధ్రువపత్రాలను కోరనున్నారు.