నేడు తొలి ఏకాదశి పర్వం.. ముస్తాబైన శైవ, వైష్ణవ క్షేత్రాలు
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, జూలై 19: తెలుగు సంవత్సరాల్లో 12 మాసాలుంటాయి. వీటిలో 24 పర్యాయాలు ఏకాదశి వస్తుంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా భక్తులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి పర్వాన్ని ఈ నెల 20న మంగళవారం జరుపుకోనున్నారు. దీనినే ‘శయన ఏకాదశి’ అంటారు. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి సహా ముక్కోటి దేవతలంతా శయనించడం వల్ల దీనికి ‘శయన ఏకాదశి’ అని పేరు వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో జారుకుంటాడని, మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోగ నిద్ర స్థితిలో ఉన్న శ్రీమహావిష్ణువు తన సృష్టి సంరక్షణ విషయాలను సమీక్షిస్తాడని నమ్మకం. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ రోజంతా విష్ణుధ్యానం, ప్రత్యేక పూజలు చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమిస్తారు.
హరిహర క్షేత్రాల దర్శనం..
ఈ పర్వం రోజున హరిహరాదులను స్మరిస్తూ నదీ స్నానాలు చేసి వారిని దర్శించుకోవడం పుణ్యఫలమని చెబుతారు. భక్తులు తొలి ఏకాదశి రోజంతా ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో హరిహరాదులను సేవిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగి, వారి కోరికలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం. తొలి ఏకాదశితోపాటు ప్రతి మాసంలోనూ వచ్చే ఏకాదశి రోజున అధికంగా శివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ఈ రోజున అధికంగా మొక్కలు నాటుతారు. ఈ రోజున చేపట్టే శుభకార్యాలకు శ్రీమహా విష్ణువు వరాలు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.
నేడు ప్రత్యేక పూజలు..
తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణ చేస్తారు. శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి అనుగ్రహ ప్రాప్తి పొందుతారు. తొలి ఏకాదశి పర్వం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.