Vijayawada Durga Gudi | విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అదే వీకెండ్ (శుక్ర, శని, ఆది వారాలు)లో 50 వేల వరకు భక్తులు వస్తున్నారు. అయితే ఇందులో 200 నుంచి 300 మంది వరకు వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలతో ఆలయానికి వస్తున్నారు. వారు టికెట్ కొనకుండానే దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వచ్చింది. మరికొంతమంది ప్రొటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేసుకుంటారని కూడా తెలిసింది. దీనివల్ల ఆలయ ఆదాయానికి గండి పడుతుందని ఆలయ అధికారులు భావించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే వీఐపీ, వీవీఐపీ దర్శనం చేసుకునే వారు సైతం టికెట్లు కొనుగోలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సిఫారసు లేఖలతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందేనని ఆదేవాలు జారీ చేశారు.