Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అతని ప్రాణ మిత్రుడే షాకిచ్చారు. కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని రామశివారెడ్డి ఆరోపించారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. తన ఫోన్లో రికార్డయినదేనని స్పష్టం చేశారు. కోటంరెడ్డి చెప్పినట్లు తనది ఐఫోన్ కాదని ఆండ్రాయిడ్ మొబైల్ కాదని స్పష్టం చేశారు. అందులో ప్రతి కాల్ ఆటోమేటిగ్గా రికార్డవుతాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రెస్మీట్ పెట్టి మరీ రామశివారెడ్డి అసలు విషయాలు బయటపెట్టాడు.
కోటంరెడ్డితో 15 ఏళ్లుగా స్నేహం ఉందని రామశివారెడ్డి తెలిపారు. కోటంరెడ్డి రాజకీయాల్లోఉంటే.. తాను మాత్రం పాలిటిక్స్ వదిలి కాంట్రాక్ట్ రంగంలోకి వెళ్లానని చెప్పారు. అయినప్పటికీ తమ స్నేహం కొనసాగిందని.. అప్పుడప్పుడు కోటంరెడ్డి తనతో ఫోన్లో మాట్లాడేవాడని తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్కు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. తనది ఆండ్రాయిడ్ మొబైల్ కావడంతో ఆ కాల్ రికార్డింగ్ ఫోన్లో ఆటోమేటిగ్గా రికార్డయ్యిందని బయటపెట్టారు. సదరు కాంట్రాక్టర్ మీద కోటంరెడ్డి ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని తోటి కాంట్రాక్టర్లకు చెబితే వాళ్లు నమ్మలేదని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లకు కాల్ రికార్డ్ పంపించానని బయటపెట్టారు. అది కాస్త వైరల్గా మారిందని చెప్పారు. రాజకీయంగా ఇది ఇంత దుమారం రేపుతుందని అస్సలు ఊహించలేదని అన్నారు. కావాలంటే ఈ విషయమై కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
వైఎస్సార్ కుటుంబంపై తనకు అభిమానం ఉందని అన్నారు. చిన్న విషయంలో జగన్ ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకనే మీడియా ముందుకొచ్చానని స్పష్టం చేశారు. తాను ఎవరో ఏపీ సీఎం జగన్కు తెలియదని రామశివారెడ్డి స్పష్టం చేశారు.
జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారు : ఎమ్మెల్సీ కవిత
మార్చి 30 నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు