న్యూఢిల్లీ: పారామిలిటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో బలవన్మరణాలు పెరిగాయి. గత ఏడాది 2025లో సుమారు 59 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన అయిదేళ్లలో ఇదే అత్యధికం అని డేటా ద్వారా తెలుస్తోంది. అయితే 77 శాతం కేసుల్లో.. విధి నిర్వహణలోనే సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందినట్లు గుర్తించారు. 262 కేసుల్లో 202 మంది విధుల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగితా కేసులన్నీ ఆ సిబ్బంది సెలవుల్లో ఉన్నప్పుడు జరిగినట్లు తెలుస్తోంది. 2021 నుంచి 2025కు చెందిన డేటాను రిలీజ్ చేశారు. ఈ డేటా గురించి సీఆర్పీఎఫ్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
దళాల శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు. అయితే ఎక్కువ శాతం సూసైడ్ కేసుల్లో ఇంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సర్వీస్, హార్డ్ డ్యూటీ కూడా కారణాలుగా ఉన్నాయి. సీఆర్పీఎఫ్లో సుమారు 3.25 లక్షల మంది జవాన్లు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద భద్రతా దళం ఇది. ఎటువంటి సమయంలోనైనా కనీసం 95 నుంచి 97 శాతం మంది సిబ్బంది డ్యూటీలో ఉంటారని పేర్కొన్నారు.
ఉగ్రవాదుల ఏరివేత, చొరబాటుదారులు, శాంతి భద్రత సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉంటారు. 2025లో 59 మంది ఆత్మహత్యకు పాల్పడగా, 2024లో 46 మంది, 2023లో 57 మంది, 2022లో 43 మంది, 2021లో 57 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. గత అయిదేళ్లలో 281 మంది ఆత్మహత్య చేసుకోగా, దాంట్లో 237 మంది నాన్ గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగులే ఉన్నారు.