తిరుపతి : కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష నిర్వహించారు. మార్చి 30న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఏప్రిల్ 5న శ్రీ కోదండరాముడి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందన్నారు.
కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.