తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రసుత్తం కొండపై రెండు కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 65,297 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,975 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు వచ్చిందని తెలిపారు.
శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. తిరుపతికి చెందిన పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు.