తొలి సినిమా ‘బలగం’తో విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక వాణిజ్య పరంగానూ ఘన విజయాన్ని సాధించారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన నుంచి ద్వితీయ ప్రయత్నంగా వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం బలమైన భావోద్వేగాలను, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెరపై ఆవిష్కరించనున్నదని చిత్రబృందం చెబుతున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. డీఎస్పీ కెరీర్లోనే ఇదొక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆదివారం దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎల్లమ్మ’లో ఆయన పోషిస్తున్న ‘పర్షి’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
సింపుల్ డ్రెస్లో, చేతిలో కిరీటాన్ని పట్టుకుని సహజమైన చిరునవ్వుతో నిలబడ్డ దేవిశ్రీప్రసాద్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన ముఖంలో అమాయకత్వం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నవి. అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్టయ్యేలా ఈ సినిమా ఉండబోతున్నదని, తొలి సినిమానే అయినప్పటికీ డీఎస్పీ ‘పర్షి’గా ఒదిగిపోయి నటిస్తున్నారని, ‘బలగం’ తర్వాత మనసుల్ని తాకే మరో కథ ‘ఎల్లమ్మ’ అని దర్శకుడు వేణు యెల్దండి చెబుతున్నారు. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగానే కాక, సంగీత దర్శకుడిగా కూడా తన మార్క్ని చూపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.
అగ్ర హీరో నాగార్జున మైల్స్టోన్ మూవీ ‘కింగ్ 100’కి కూడా దేవిశ్రీప్రసాదే స్వరాలందించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. ‘కింగ్ 100’ ప్రాజెక్ట్లోకి దేవిశ్రీకి స్వాగతం చెబుతూ ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. నాగ్, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన మన్మథుడు, మాస్, కింగ్, కుబేర చిత్రాలు మ్యూజిక్ పరంగా ఎంతటి విజయాలను అందుకున్నాయో తెలిసిందే. ‘కింగ్ 100’ మ్యూజిక్తో మరోసారి దేవిశ్రీ మ్యాజిక్ చేయనున్నట్టు చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నది. అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.