AP News | యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆశపడ్డ ఓ యువతి లక్షలు పోగొట్టుకుంది. బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్న ఓ అమ్మాయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు పోస్టు చేస్తే రోజుకు వేలల్లో వస్తాయని వాళ్లు చెప్పిన మాటలకు ఆశపడింది. వాళ్లు చెప్పినట్టే వీడియోలు పోస్టు చేసింది. మరిన్ని డబ్బులకు ఆశపడి ఉన్నదంతా పోగొట్టుకుంది. దాదాపు 15 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకుంది. చివరకు మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోరుమామిళ్ల ఎస్సై హరిప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బీటెక్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆశచూపారు. వాళ్ల మాటలు నమ్మిన ఆ విద్యార్థి మొదట ఒకటి రెండు వీడియోలు అప్లోడ్ చేసింది. వాటికి మొదటి రోజు రూ.2వేలు, తర్వాత రోజు రూ.3వేలు ఇచ్చారు. దీంతో వాళ్లను సదరు యువతి పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలో ఆన్లైన్లో పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం వస్తుందని నమ్మేలా చెప్పారుజ. ఇప్పటికే యూట్యూబ్ వీడియోలతో డబ్బులు ఇస్తుండటంతో వాళ్లపై విశ్వాసం ఉంచి ఓకే చెప్పింది. అలా వచ్చిన డబ్బులకు పన్నులు కట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. వాళ్ల మాటలు నమ్మిన సదరు విద్యార్థిని వారం రోజుల్లో రూ.14,75,000 వాళ్ల ఖాతాలో జమ చేసింది. ఈ నెల 6వ తేదీ, 10వ తేదీన రెండు విడతల్లో వాళ్ల ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. అప్పట్నుంచి వాళ్ల దగ్గర నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
“Google Search | గూగుల్లో ఏదైనా వెతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి”