ఎదులాపురం : మహరాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు ఇక్కడ ఎస్టీలుగా చెలమణి అవుతున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్చౌరస్తా వద్ద తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గణేశ్ మాట్లాడుతూ… మహరాష్ట్ర లంబాడీలు తెలంగాణలో చొరబడి నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకుని చలామణి అవుతున్నారని దీంతో ఇక్కడి ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని సీఎం ప్రస్తవించారని గుర్తుచేశారు.
ఆదివాసుల విద్య, ఉద్యోగ,ఉపాధి రిజర్వేషన్లు దొడ్డిదారిన దోచుకుంటూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆదివాసులకు న్యాయం చేయాలంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నామన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు గుర్తించినందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్ర శ్యాంరావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, జిల్లా కోశాధికారి మరప భారత్, నాయకులు తొడసం మనోహర్, ఆత్రం భర్తబ్, చకహాటీ సునీల్, సిడం పురుషోత్తం,జంగల పోచ్చన్న, గోవింద్, గంగాధర్, గణపథ్, సంతాబాయి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.