రామకృష్ణాపూర్, మే 9 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తరని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడిలోగల అమ్మ గార్డెన్ కమాన్ వద్ద రోడ్ షో నిర్వహించారు. బాల్క సుమన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, ప్రజలంతా సాగు, తాగు నీటికి, కరెంట్కు గోసపడుతున్నా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి మోసపూరిత వాగ్ధానాలతో ముందుకొస్తున్న కాంగ్రెస్ పార్టీని అస్సలు నమ్మొద్దన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ నియోజకవర్గంలో 45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడని, ఇంత వరకు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇప్పించింది లేదని, తన కొడుకు వంశీకృష్ణకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకునే పనిలో పడ్డాడని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి పాలనలో నీళ్లు లేక 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలవ్వాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, అప్పుడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. హామీలు అమలయ్యేలా ఒత్తిడి చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శనివారం చెన్నూరులో నిర్వహించే కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు 7,8,9,10 వార్డులకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య, 9వ వార్డు కౌన్సిలరు పారిపెల్లి తిరుపతి, చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేశ్, 7వ, 10వ వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.