నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 26 : సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నిర్మల్ జిల్లాలో 735 పాఠశాలలకు గాను మొదటి విడుతలో 266 ఎంపికయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ చేకూరగా.. పేదలకు మరింత నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందనుందన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు. డీఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి విదేశాల్లో ఉన్న వారు, ఉద్యోగం చేస్తున్న వారు తమ ఊరి బడికోసం ముందుకొచ్చి దాతృత్వాన్ని చాటుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, విద్యాకమిటీ చైర్మన్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉర్దూ భాషపై సెమినార్ నిర్వహించగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. మైనార్టీ విద్యార్థుల సౌకర్యార్థం చించోలిలో రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ భవనం నిర్మిస్తున్నామన్నారు. డిగ్రీ విద్యార్థుల సౌకర్యార్థం పలు కోర్సులను ప్రవేశపెట్టాలని మంత్రికి వినతిపత్రం అందించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ సంపంగి రవి పాల్గొన్నారు.
క్రీడలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సికింద్రాబాద్లోని హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగు, ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్నారు. మొత్తం 200 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారని, ప్రతిభ కనబర్చిన 40 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీవైఎస్వో ముత్తన్న, పేటా అధ్యక్షుడు భూక్యా రమేశ్, పీఈటీలు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : దేశంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ర్టానికి మూడో స్థానం దక్కడంలో ఆశ కార్యకర్తల పాత్ర అయోఘమైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 669 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏ ఆరోగ్య కార్యక్రమం నిర్వహించాలన్నా అందులో ఆశ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవడంతో గుర్తింపు వచ్చిందన్నారు. కాగా.. జాతీయ పల్స్పోలియో వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం నిర్వహించే పల్స్పోలియోను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. పల్స్పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించాలన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, తహసీల్దార్ శివకుమార్, వైద్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడంతో సంబుర పడ్డారు. వారంతా కొత్త ఫోన్లను ఆన్చేసి తొలి సంబురాన్ని స్మార్ట్గా సెల్ఫీలతో ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా కలెక్టర్ కార్యాలయంలో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందితో కొత్త స్మార్ట్ ఫోన్తో ‘ఫస్ట్ సెల్ఫీ’ అంటూ ఉత్సాహంగా గడిపారు.