తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదారులకు రూ.86 లక్షల 9వేల 976 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత పేదరిక నిర్మూలనకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు.
రైతుల కోసం ఉచిత కరెంట్, రుణమాఫీ, రైతు బంధు, ఎస్సీలకు దళితబంధు, పేదలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాశెట్టి సాగరబాయి, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, ఆత్మ చైర్మన్, పార్టీ మండల కన్వీనర్ పోతారెడ్డి, తాసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, తానూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూర్యకాంత్పవార్ తదితరులు పాల్గొన్నారు.