శ్రీరాంపూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గురువారం సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీపీలపై కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు డీ అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవిందర్రెడ్డి, కే వీరబద్రయ్యల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సింగరేణి సంస్థ కొన్నేళ్లుగా రూ. 65 కోట్లు వెచ్చించి గనుల నిక్షేపాలు కనుగొని ఏర్పాట్లు చేసుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
వేలం వేయాలని చూస్తున్న గనులు కోయగూడెం 3, ఓసీపీఇ సత్తుపల్లి 3 ఓసీపీ, కళ్యాణిఖని-6 బ్లాక్, శ్రావణ్పల్లి బొగ్గు బ్లాక్ను ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గనుల ప్రైవేటీకరణ విరమించుకొని సింగరేణి సంస్థకు అప్పగించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, కార్మిక చట్టాల సవరణ బిల్లు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు నవంబర్ 1న సింగరేణి వ్యాప్తంగా గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తామన్నారు.