కోటపల్లి, ఏప్రిల్ 08: సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. కోటపల్లి (Kotapally) ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో కలిసి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణహిత నదీ తీరంలో పడవలు నడిపే యజమానులు, మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా, కదలికలలో తేడా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరు, నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు సహరించాలని, గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిగినా, సేవించినా తమకు సమాచారం అందించాలన్నారు. మహిళ భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఉల్లంగిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామంలో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.