కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానపల్లి, బెజ్జూర్ మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ వాల్ పోస్టర్లు చర్చకు దారితీశాయి. కర్రెగుట్ట పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ వాల్ పోస్టర్లను ముద్రించారు. ‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం… మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు..? ఇదేనా మీ సిద్ధాంతం..? ఇందుకోసమేనా మీ పోరాటం..?’ అంటూ ఆదివాసీ యువజన సంఘం, తెలంగాణ రాష్ట్రం పేరిట వాల్ పోస్టర్లను అంటించడంతో కలకలం రేగింది.
చింతలమానపల్లి మండలం కర్జవేల్లి, బెజ్జూరు మండల కేంద్రాల్లో వాల్ పోస్టర్లను అంటించడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాల్ పోస్టర్లు అంటించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోస్టర్లను అంటించడంపై ఆరా తీస్తున్నారు. ఆదివాసి సంఘం పేరిట మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ శాఖ అప్రమత్తమై ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెంచారు. కర్రెగుట్టలో మందుపాతర పేలుడు జరిగి చాలా రోజులు కాగా ఇప్పుడు వాల్ పోస్టర్లు పెట్టి మావోయిస్టులకు సవాల్ విసిరడం చర్చనీయాంశం అయింది.