కుమ్రంభీం ఆసిఫాబాద్ : కార్యకర్తలందరికీ బీమా కల్పించి వారి కుటుంబాల్లో టీఆర్ఎస్ పార్టీ భరోసా నింపిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తమ రక్షణ కవచంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా నాయకులతో కలిసి మంత్రి సిర్పూరు – కాగజ్ నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకులంతా కష్టపడి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదును పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేస్తే వచ్చే నెల 1వ తేదీ నుంచే కార్యకర్తలకు బీమా అమలులోకి వస్తుందని తెలిపారు. 50 వేల లక్ష్యం ఇస్తే 48 వేల సభ్యత్వాలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు.