కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల మనసులు దోచుకున్నాయి. లబ్ధిదారులకు నేరుగా లాభాన్ని కలిగించాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవడంతో పాటు, వారి ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆదాయ వనరులను అభివృద్ధి చేయడంతోపాటు ఇంటింటా సంక్షేమాన్ని అందించింది. తొమ్మిదేళ్ల కాలంలో జిల్లాలో ప్రభుత్వ పథకాలను పొందని ఇళ్లులేదంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ పథకాలు చేరాయి.
రోడ్లు, వంతెనలు, పాఠశాల భవనాల నిర్మాణాలతో పాటు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమానంగా కొనసాగించింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, జోడేఘాట్ అభివృద్ధి, సిర్పూర్ నియోజకవర్గంలో ఎస్పీఎం తిరిగి ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి కలిగింది. కాగజ్నగర్ పట్టణంలో వ్యాపార, వాణిజ్యాలు బాగాపెరిగాయి. ప్రాణహితపై రూ.65 కోట్లతో వంతె నిర్మాణంతో మహారాష్ట్ర, ఛత్తీష్గఢ్, మధ్యప్రదేశ్తో మావన సంబంధాలతో పాటు వ్యాపారాలు పెరిగాయి. రూ.75 కోట్లతో వార్థాపై మరో భారీ వంతెన నిర్మాణం చేపడుతుండడంతో సిర్పూర్ నియోజకవర్గంతోపాటు, ఆసిఫాబాద్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందే అస్కారం ఏర్పడింది.