‘కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ.. 60 ఏండ్లలో వాళ్లు చేసిందేమీ లేదు. వాళ్ల పాలనలో ఎంతో మంది కర్షకులు ఆత్మహత్య చేసుకున్నారు. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటే ఇస్తామని టీపీసీసీచీఫ్ రేవంత్రెడ్డి అంటున్నాడు. అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేతి గుర్తుకు ఓటేస్తే మళ్లా అంధకారమే. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు, కేసీఆర్ మూడు పంటల విధానంపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో అన్నదాతలు ఆనందంగా బతుకుతున్నారు. అది చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ‘హస్తం’ నాయకులను పల్లెల్లోకి రానియొద్దు.. అడుగడుగునా నిలదీయాలి.’ అంటూ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. మంగళవారం దండేపల్లి, హాజీపూర్ మండలం కర్ణమామిడి, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట, కాసిపేట మండలం ధర్మారావుపేట, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి, ధనోరా, సాంగ్వి రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై పలు తీర్మానాలు చేశారు.
– దండేపల్లి/హాజీపూర్/లక్షెట్టిపేట/కాసిపేట/కెరమెరి, జూలై 18
కాసిపేట, జూలై 18 : రైతులకు ఇస్తే, గిస్తే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం దారుణమని, ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, వారివి పక్కా రైతు వ్యతిరేక విధానాలేనని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేట రైతు వేదికలో సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుంటే.. ఓర్వలేని కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కరెంట్ వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతు వ్యతిరేక విధానాలు బయట పెడుతూ భయపెడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు, రైతులు గమనించాల్సిన అవసరముందని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సహకార సంఘం మాజీ చైర్మన్ వంశీకృష్ణారావు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అప్పాల శేఖర్, మంజులారెడ్డి, సర్పంచ్లు ఆడె బాదు, మక్కల శ్రీనివాస్, ముత్యాల స్వప్న, వాస్దేవ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.