ఎదులాపురం : ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులు వ్యాక్సిన్ తీసుకోవాలని , ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకాలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులు జిల్లాకు వచ్చారని వారికి పూర్తి సహకారం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో చేపడుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన , ప్రధానమంత్రి అవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన తదితర పథకాల గురించి ఈ నెల 24వ తేదీ వరకు గుర్తించిన గ్రామాలలో పనులు పరిశీలిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ , డీఆర్డీఏ కిషన్ , డీపీవో శ్రీనివాస్, ఎల్డీఎం చంద్రశేఖర్ , డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ , కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, నలంద ప్రియా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.