డీఆర్డీఏ కిషన్ మాంగ్రూడ్లో మెగా పార్క్ఏర్పాటుకు స్థల పరిశీలిన
బేల, ఆగస్టు 5 : మండలానికో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డీఆర్డీఏ కిషన్ తెలిపారు. మండలంలోని మాంగ్రూడ్ సమీపంలో మెగా పార్కు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. పార్కులో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మెగా పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలం సేకరించామని చెప్పారు. ఈ స్థలాల్లో వారం రోజుల్లో పనులు పూర్తి చేసి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో పార్కుకు దాదాపు రూ.40 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో భగత్ రవీందర్, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు మంగేశ్ ఠాక్రే, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి
ఇంద్రవెల్లి, ఆగస్టు 5: ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని డీఆర్డీవో కిషన్ అన్నారు. మండలంలోని పిట్టబొంగురం పరిధిలోని పాటగూడలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు పెంచాలన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో సంతోష్జైస్వాల్, అధికారులు పాల్గొన్నారు.
మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వద్దు
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 5 : హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చూపవద్దని డీఆర్డీవో కిషన్ అన్నారు. మండలంలోని గోండగూడ వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ను గురువారం ఆయన పరిశీలించారు. నర్సరీల్లో పెంచిన ప్రతి మొక్కనూ నాటేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు వెంటనే ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటిని నిత్యం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో 16 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే 10 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. మిగిలిన మొక్కలను త్వరలోనే నాటుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, ఈజీఎస్ ఏపీవో రజినీకాంత్, టీఏ లత, సాజిద్, కూలీలు పాల్గొన్నారు.