ఆసిఫాబాద్, మే 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వికాస సంకల్ప యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొన్నారు. ముందుగా గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా, సరస్వతీ దేవి, సేవాలాల్ మహరాజ్తో పాటు స్వాతంత్య్ర సమర యోధులు కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీకి వందనాలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని స్కాములే ఉంటాయన్నారు. కాంగ్రెస్.. ఓవైసీ ఒక్కటేనని, అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం సోదరీమణులు సంతోషంగా ఉన్నారన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు.