మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల టౌన్, మే 5 : “పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం పక్కా.. పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ గెలుస్తున్నడు. సర్వేలన్నీ ఇదే చెబుతున్నయ్”.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పెద్దపల్లితో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని జిల్లాలు రద్దు చేస్తారంట కాంగ్రెసోళ్లు.. మరి జిల్లాలు ఉండాలి అనుకునేటోళ్లు బీఆర్ఎస్కు.. వద్దు అనుకునే వాళ్లు కాంగ్రెస్కు ఓటు వేయండం టూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ ఒక్క రోడ్షోతో ప్రజలను ఆలోచింప చేయడంతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయవకాశాలను మెరుగుపరిచారంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా కేసీఆర్ రోడ్ షోకు హాజరైన జనం, ఆయన ప్రసంగం గురించే చర్చ నడుస్తున్నది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో జోష్ పెరిగింది. ప్రచారంలో దూకుడు పెంచిన గులాబీ లీడర్లు కేసీఆర్ ప్రస్తావించిన అంశాలే ఆయుధంగా దూసుకెళ్లిపోతున్నారు. ఎక్కడికెళ్లినా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీనే గెలిపించాలంటూ చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జిల్లాల రద్దు అంశంతో పాటు కేసీఆరే కొప్పుల ఈశ్వర్ గెలుస్తున్నడని చెప్పిం డు.. ఆయనే గెలుస్తడేమో అనే పాజిటివ్ టాక్ నడుస్తున్నది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో రాజకీయు ముఖచిత్రం మారిపోయింది. నిన్న..మొన్నటి వరకు కార్యకర్తలు, నాయకుల్లో ఉన్న అపోహలన్నీ కేసీఆర్ టూర్తో పటాపంచలైపోయాయి. గులాబీ దళపతి ఇచ్చిన బలంతో పెద్దపల్లి, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందుకుసాగుతున్నాయి.
ఐదు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్ తన ప్రసంగంలో ప్రభు త్వ పాలన వైఫల్యాలను ఎండగట్టడం, ఆరు గ్యారంటీలను ప్రశ్నించడంతో జనంలోకి చొచ్చుకుపోయా రు. రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా… వరికి రూ.500 బోనస్ వచ్చిందా.. కల్యాణలక్ష్మి తులం బంగారం వచ్చిందా.. మహిళలకు 2500 వచ్చా యా& అంటూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సింగరేణి ప్రైవేటు పరం అంశాన్ని ప్రస్తావించి కార్మిక పక్షపాతిగా నిరూపించుకున్నారు. కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్పై ప్రేమగా మార్చడంలో కేసీఆర్ వందకు వందశాతం సక్సెక్ అయ్యారు.
రైతులు, సింగరేణి కార్మికులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్కు ఓటేసి ఆగమైపోయినమనే డైలమాలో ఉన్న ప్రజానీకానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందనే భరోసాను కల్పించారు. ఇక బీజేపీతో తెలంగాణకు ఒరిగేది ఏముండదంటూ మరోసారి చెప్పకనే చెప్పారు. దీంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు డైలమాలో పడిపోయారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ చేసిన దాడితో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి ప్రత్యర్థి పార్టీలు వెళ్లిపోయాయి.
కొత్త జిల్లాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటున్న ది.. చావునోట్ల తలపెట్టి కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతే మౌనం వహించబోను.. జిల్లాలను రద్దు చేస్తే యుద్ధం చేద్దామన్న పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల మనసును గెలుచుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మంచిర్యాల, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే నూరు.. నూటయాభై కిలోమీటర్లు పోవాల్సి వచ్చేది. ఇగ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే ఒక్కరోజు పోయి, మరుసటి రోజు పని చూసుకొని, మూడో రోజూ తిరిగి రావాల్సి వచ్చేది. కొత్త జిల్లాలతో ఆ బాధలు తప్పినయ్. ఇప్పుడు ఉన్నఫలంగా ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే మళ్లీ పాత కష్టాలు వస్తాయి. ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్న గిరిజన తండాలు, గూడేలు మళ్లీ అంధకారంలోకి నెట్టబడుతాయి.
కేసీఆర్ చెప్పిందే నిజం&గీ జిల్లాలు గిట్లనే ఉండాలనే భావన ప్రజల్లో పెరిగింది. ఏదో జరుగుతుందని మార్పు కోరుకుంటే ఇంత గోస పడాల్సి వస్తుందనుకోలేదంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదే ట్రెండ్లో వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగు ఉండబోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క బస్సు యాత్ర ఉమ్మడి జిల్లా రాజకీయాలనే మార్చేసిందని.. బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెంచేసిందనే చర్చ నడుస్తున్నది. ఇదే ఉత్సాహం కొనసాగితే ఎన్నికల ఫలితాలను తిప్పేయడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తానికి ఒక్క కేసీఆర్ రోడ్షో ప్రత్యర్థిపార్టీలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే జోష్ మరో వారం రోజులు నడిస్తే ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ అనుకూలంగా మారిపోయే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నది.