Rayapole | రాయపోల్: రాయపోల్ మండల కేంద్రంలోనే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించడాన్ని గ్రామస్తులు (Villagers) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం మండల కేంద్రంలోనే చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. సర్వే నంబర్ 720 లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, అక్కడే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని పేర్కొన్నారు.
స్థల పరిశీలన విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి, మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయ (MRO Office) నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యాలయాన్ని మండల కేంద్రం వెలుపలికి తరలించే ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం, మండల కేంద్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంతు రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.