నార్నూర్,జూలై 29: గుండెపోటుతో బుధవారం మృతి చెందిన డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్డీవో కిషన్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, ఉట్నూర్ డీఎస్పీఉదయ్రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయల సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇన్సూ అక్బానీ, అఖిల భారతీయ బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్తో పాటు పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు, సంఘాల నాయకులు, అభిమానులు హాజరై పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏజెన్సీలో గిరిజనేతరుల సమస్యలు, హక్కుల సాధనకు నిరంతరం శ్రమించిన దళిత నేత మరణాన్ని బహుజనులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన నివాసం నుంచి పొలం వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
డీసీసీబీ చైర్మన్ చిరస్మరణీయుడు: మంత్రి అల్లోల
సామాజిక సేవతో పాటు రాజకీయ నేతగా నాందేవ్ కాంబ్లే చేసిన సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పార్థీవ దేహాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ కనక మోతుబాయి , సర్పంచ్లు కుమ్ర సావిత్రీబాయి, బానోత్ గజానంద్నాయక్, ఐటీడీఏ మాజీ చైర్మన్ కనక లక్కేరావ్, జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, రితేశ్రాథోడ్, అనిల్ జాదవ్, దుర్గే కాంతారావ్, మహేందర్, నర్సింగ్ మోరే, మోతే రాజన్న, దుర్గం శేఖర్, పరమేశ్వర్, తదితరులు హాజరయ్యారు.
మార్కెట్ బంద్
డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే అంత్యక్రియలు గురువారం నిర్వహించిన సందర్భంగా గాదిగూడ, లోకారి(కే), మేడిగూడ మార్కెట్లో వ్యాపారులు స్వచ్ఛదంగా మార్కెట్ బంద్ చేశారు.