గూడూరు, మే 4 : బిడ్డా సల్లంగ ఉండు.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటం. మాకు పింఛన్, తాగునీరు రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ సారే రావాలి’ అంటూ ప్రజలు బీఆర్ఎస్ మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను దీవించారు. శనివారం ఆమె స్థానిక నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గూడూరు, బొల్లేపల్లి, పొనుగోడు, అయోధ్యపురం, మధనాపురం, గాజులగట్టు, బొద్దుగొండ గ్రామాల్లో ప్రచారం చేశారు.
ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఓటు అభ్యర్థించారు. గూడూరు మండల కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్లో పూరీలు చేసి కస్టమర్లకు అందిస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారితే వచ్చే నష్టమేమి లేదని, ప్రజల్లో బీఆర్ఎస్పై అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు.