Inter Student | దుండిగల్, మార్చి 6: ఇంటర్ పరీక్షల భయంతో ఓ యువతి ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.మహాలక్ష్మి, బాపిరాజు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు కృష్ణవేణి(19) రెండేండ్ల కిందట ఏపీలోనే ఇంటర్ పూర్తి చేసింది. అయితే, ఇంటర్లో ఒక సబ్జెక్టు మిగిలడంతో.. అప్పటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నది. ఈ క్రమంలోనే రెండేండ్ల కిందట మహాలక్ష్మి కుటుంబం నగరానికి వచ్చి, స్థానిక వసంతనగర్లో ఉంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 15న కృష్ణవేణికి పరీక్షలు ఉండటంతో బాగా చదువుకోమంటూ తల్లిదండ్రులు సూచించారు. ఓ వైపు పరీక్షల భయం, మరో వైపు తల్లిదండ్రుల సూచనతో ఆందోళనకు గురైన కృష్ణవేణి.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తాము నివాసముంటున్న అపార్ట్మెంటు ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.