Millet Bank | విశాల ఉయ్యాల, ప్రియాంక భరద్వాజ్.. గ్రామాల్లోని మహిళా రైతులకు, నగరాల్లోని గృహిణులకు వారధిగా నిలుస్తున్నారు. అక్కడ పండించిన చిరుధాన్యాలను చిరుతిండ్లుగా మార్చి.. ఇక్కడి గృహిణుల ద్వారా కుటుంబానికంతా పరిచయం చేస్తున్నారు. ఆ ఇద్దరి కలలపంట ‘మిల్లెట్ బ్యాంక్’ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నది.
ఆ ఇద్దరూ పుట్టి పెరిగిన ప్రాంతాలు వేరు. అయితేనేం, ఒక మంచి ఆలోచన ఒక్కటి చేసింది. హైదరాబాద్ ఆ బంధాన్ని మరింత దృఢపరిచింది.. పాత తరాల ఆరోగ్యానికి ముఖ్య కారణమైన చిరుధాన్యాలను నవతరానికి అలవాటు చేయాలని కంకణం కట్టుకున్నారు విశాల ఉయ్యాల, ప్రియాంక భరద్వాజ్. తాము స్థాపించిన మింకన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ ద్వారా ‘మిల్లెట్ బ్యాంక్’ బ్రాండ్తో రకరకాల ‘చిరు’తిండ్లను మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పటికే జనాలకు చిరుధాన్యాలపై అవగాహన వచ్చినా, అడపాదడపా రుచి చూసిన అనుభవాలు ఉన్నా.. పూర్తిస్థాయి ఆహారంగా ఆమోదించడం లేదు. నిజానికి, మిల్లెట్ వంటకాల తయారీ మామూలు అన్నం వండినంత సులభం కాదు. ఆ పరిమితిని అధిగమిస్తూ.. రకరకాల పద్ధతుల ద్వారా సంప్రదాయ ధాన్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ ఇద్దరూ.
‘మాది రైతు కుటుంబం. చిన్నప్పుడు మా అమ్మ చిరుధాన్యాల వంట చేసేది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. టూరిజంలో పనిచేశాను. తర్వాత ఈవెంట్ మేనేజర్గా మారాను. మధ్యలో కొన్నాళ్లు మా స్వస్థలం చిత్తూరులో మూడు నెలలు ఉన్నాను. అక్కడ మా అక్క తాను పండించే చిరుధాన్యాలను చాలా తక్కువ ధరకు అమ్మడం చూశాను. కానీ, మార్కెట్లో మాత్రం ధరలు ఆకాశాన్ని అంటేవి. ఇదంతా గమనించి, మా అక్కలాంటి మహిళా రైతులకోసం ఏదైనా చేయాలనుకున్నా. ఊళ్లో ఒక సెంటర్ ఏర్పాటుచేసి అవగాహన సదస్సు నిర్వహించాను. అప్పుడే ఒక స్టార్టప్ మొదలుపెట్టాలన్న ఆలోచన వచ్చింది. గ్రౌండ్వర్క్ ప్రారంభించాను. తర్వాత ప్రియాంక పరిచయమైంది. ఇద్దరం కలిసి కంపెనీని రిజిస్టర్ చేయించాం. చిరుధాన్యాల స్నాక్స్ తయారీ, మార్కెటింగ్తో పాటు మహిళా ఆంత్రప్రెన్యూర్ల కోసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. రానున్న ఐదేండ్లకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇటీవల మాకు ఫిక్కీ ‘బెస్ట్ ఉమెన్ అగ్రి ఆంత్రప్రెన్యూర్’ అవార్డు వచ్చింది. నాబార్డ్ కూడా నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. కంపెనీకి సంబంధించి బ్యాక్ఎండ్ వర్క్ నేను చూస్తాను. ఆపరేషన్స్ మొత్తం ప్రియాంక పర్యవేక్షిస్తుంది. ప్రజల రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసి, రేపటితరాన్ని ఆరోగ్యంగా తయారు చేయాలన్నది మా సంకల్పం. ఇప్పుడు అన్ని దుకాణాల్లో కూడా చిరుధాన్యాలు దొరుకుతున్నాయి. కాకపోతే వాటిని వండటం అందరికీ సాధ్యం కాదు. దేంట్లోకి ఏ కూర బాగుంటుందనే అవగాహనా ఉండదు. అందుకే, మేం ఒక యూట్యూబ్ చానెల్ తీసుకొస్తున్నాం. అందులో చిరుధాన్యాలతో రకరకాల వంటల తయారీని పరిచయం చేస్తాం’ అని చెబుతున్నారు మిల్లెట్ బ్యాంక్ కో-ఫౌండర్ విశాల.
‘ఒక భార్యగా, తల్లిగా చెబుతున్నాను. కుటుంబ ఆరోగ్యంలో ఇల్లాలి పాత్రే కీలకం. మార్కెట్లో చిరు ధాన్యాలు, రెడీ-టు-కుక్ పదార్థాలు చాలానే ఉన్నాయి. వాటిని పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదే. చిరుధాన్యాల లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిస్కెట్లు, చిక్కీలు మాత్రమే కాకుండా.. జనాలు ఇష్టంగా తినే నూడుల్స్, పాస్తా లాంటివీ తీసుకొచ్చాం. త్వరలోనే కనీసం 100 రుచులను పరిచయం చేస్తాం. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిటికీ చిరుధాన్యాలను ఎంచుకుంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని సాధించవచ్చు’ అంటున్నారు ప్రియాంక.
ఇప్పటికే మహిళా రైతులు పండించే చిరుధాన్యాలను కొని.. వాటితో కుకీస్, నూడుల్స్, ఎనర్జీ బార్స్, బిస్కెట్స్, పాస్తా తయారు చేయించి ‘మిల్లెట్ బ్యాంక్’ బ్రాండ్ మీద విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో పల్లెల్లో చిరుధాన్యాల కేంద్రాలను ఏర్పాటుచేసి.. అక్కడే మార్కెట్కు అనువుగా పంటను ప్రాసెస్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. పర్యావరణానికి హానిచేయని పదార్థాలు ముడి సరుకుగా గ్రామీణ మహిళలతో బుట్టలు తయారు చేయించి.. కార్పొరేట్ సంస్థలకు విక్రయించే ప్రయత్నమూ మొదలైంది. ఇప్పటివరకు 2 వేల బుట్టల వరకూ అమ్మగలిగారు. మిల్లెట్ ఎక్స్పీరియెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలనేది ఇద్దరి ఆలోచన. దీని ద్వారా సాధారణ రైతులు సైతం దర్జాగా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం చిరుధాన్యాల మార్కెట్లోకి వందలకొద్దీ స్టార్టప్లు వస్తున్నాయి. అందులో 80శాతం ఏడాదికే మూతపడుతున్నాయి. కాబట్టి, ఈ రంగంలోకి కేవలం లాభాలకోసమే కాకుండా సామాజిక బాధ్యతతో రావాలంటున్నారీ మిల్లెట్ బ్యాంక్ దోస్తులు.
✍ నిఖిత నెల్లుట్ల
ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”