Blubot Robotics CEO Haripriya Reddy | మోకాళ్లలోతు బురద. భుజాన పదిహేను కేజీల బరువున్న పంపు. ట్యాంకులో పది లీటర్ల పురుగుమందు. ముక్కుకు తువ్వాలు చుట్టుకొని, పొద్దుగుంకే వరకూ మందులు పిచికారీ చేసే రైతన్నకు చివరికి మిగిలేవి.. కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, కళ్ల మంటలు, ఒంటి దురదలే. ఈ కష్టానికి డ్రోన్ టెక్నాలజీతో పరిష్కారం కనిపెట్టింది.. యువ ఆంత్రప్రెన్యూర్, ‘బ్లూబోట్ రోబోటిక్స్’ సీయీవో హరిప్రియా రెడ్డి.
‘వడ్లు ఎన్నొచ్చినయ్ అంటారే కానీ, ఎడ్లు ఎన్ని సచ్చినయ్’ అని ఎవరూ అడగరు. అందుకే దేశానికి అన్నంపెట్టే రైతన్న.. పంటను కాపాడుకునేందుకు భుజానికి పంపు తగిలించుకొని పురుగుమందు కొట్టుకుంటూ ఒంటిని నొప్పుల కుంపటి చేసుకుంటున్నాడు. పంటతోపాటే తనూ మందుబుక్కుతున్నాడు. పురుగుమందు ప్రభావంతో అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకున్న రైతులు ఎంతోమంది. ఆ మరణ మృదంగాన్ని ఆపేయాలన్నది హరిప్రియా రెడ్డి ఆకాంక్ష. ఆ ప్రయత్నంలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని సేద్యంలో భాగం చేస్తున్నది. హరిప్రియ హైదరాబాద్లో పుట్టిపెరిగింది. శంషాబాద్ దగ్గర నాగారం ఆమె సొంతూరు. నలుగురు తాతయ్యల కుటుంబాలు నేటికీ కలిసే ఉన్నాయి. ఆ ఉమ్మడి కుటుంబ సభ్యుల సంఖ్య యాభైమూడు. వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియని మనుషుల మధ్య పెరిగింది హరిప్రియ. ఇంజినీరింగ్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. కాస్ట్యూమ్ డిజైనర్గా సినిమా పరిశ్రమలో కాలు పెట్టింది. నాలుగు పెద్ద సినిమాలకు, ఎనిమిది వెబ్సిరీస్లకు డిజైనర్గా పనిచేసింది. భర్త శ్రీపాల్రెడ్డితో కలిసి యాడ్ఫిల్మ్స్ రూపొందించింది. అందులో కొన్ని వ్యవసాయ సంబంధమైనవీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్లో భాగంగా భర్తతో కలిసి వివిధ రాష్ర్టాలకు వెళ్లేది. ఏ ప్రాంత రైతులతో మాట్లాడినా పురుగుమందు కొట్టడం చాలా ఇబ్బందిగా ఉందనే చెప్పేవారు. ఆ దుష్ప్రభావాలు తమ శరీరాన్ని ఎలా కుళ్లబొడుస్తున్నదీ వివరించేవారు. అందులోనూ మహారాష్ట్రలో మూడు నెలల వ్యవధిలోనే 12 మంది రైతులు పురుగుమందు పిచికారీ చేస్తూ చనిపోయారని తెలిసి.. చలించిపోయింది హరిప్రియ. వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించింది. అప్పటికే చైనాలో డ్రోన్లతో మందు పిచికారీ చేయిస్తున్న విషయం తెలుసుకొని, దాదాపు రూ.12 లక్షలు ఖర్చుచేసి ఓ డ్రోన్ తెప్పించింది.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన స్నేహితుడు వెంకట్ శ్రేయస్ సహ-వ్యవస్థాపకుడిగా భర్తతో కలిసి ‘బ్లూబోట్ రోబోటిక్స్’ సంస్థను ప్రారంభించింది హరిప్రియ. అధ్యయనంలో భాగంగా కొబ్బరి తోటలు మొదలు వివిధ రకాల పండ్ల తోటలు, తేయాకు, కంది, మక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాల పంటలపై ప్రయోగాలు చేసింది. మొదట్లో డ్రోన్ల పట్ల గ్రామీణులకు ఎన్నో అపోహలు ఉండేవి. దీంతో వారి ముందే పొలంలో మందు పిచికారీ చేసి చూపేవారు ‘బ్లూబోట్ రోబోటిక్స్’ సభ్యులు. మెల్లగా రైతుల్లో నమ్మకం కలిగింది. ఓ చిన్న యంత్రం రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతూ.. ఆరు నిమిషాల్లో ఎకరం మందును పిచికారీ చేస్తుంటే.. కళ్లప్పగించి చూశారు.
రైతులకు డ్రోన్లు విక్రయించడం మొదలు.. శిక్షణ, మరమ్మతులు, సర్వీసింగ్, రీప్లేస్మెంట్ వంటి అన్ని బాధత్యలనూ బ్లూబోట్ రోబోటిక్స్ చూసుకుంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘కృషియంత్ర’ పేరుతో ఓ యాప్ను రూపొందించారు. దీనిలో సభ్యత్వం తీసుకుంటే.. రైతుల నుంచి డ్రోన్ పైలట్ల వరకూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సంప్రదించవచ్చు. రైతులకు సభ్యత్వం ఉచితం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీతో డ్రోన్లు కొనుగోలు చేసినవారు కూడా, కృషియంత్ర ద్వారా సేవలు పొందవచ్చు. ఇప్పటికే ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రైతన్నలకు డ్రోన్లు పరిచయం చేసింది హరిప్రియా రెడ్డి బృందం.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉంది బ్లూబోట్ రోబోటిక్స్. ఇప్పటి వరకూ విడిపరికరాలను కొనుగోలు చేసి.. స్థానికంగా ఓ రూపం ఇస్తున్నారు. రైతుల్లో ఇప్పుడిప్పుడే డ్రోన్ టెక్నాలజీపై అవగాహన పెరుగుతున్నది. ప్రభుత్వాలు జీఎస్టీ, దిగుమతి సుంకాలు తగ్గించాయి. వచ్చే ఆరు నెలల్లో ‘మేడిన్ ఇండియా డ్రోన్ల’కు రూపం ఇవ్వాలన్నది హరిప్రియ బృందం ఆలోచన. విత్తనాలను డ్రోన్ల ద్వారా వెదజల్లే దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ స్ప్రేయింగ్తో గ్రామీణ నిరుద్యోగులకు చేతినిండా ఉపాధి దొరుకుతుంది. రైతులు రసాయనాల ఘాటు నుంచి తప్పించుకోవచ్చు. కూలీ ఖర్చుతో పోలిస్తే చవకే. 15 శాతం నీళ్లు, 30 శాతం పురుగుమందు ఆదా అవుతాయి. ‘డ్రోన్ సేద్యం భారతీయ వ్యవసాయ విధానంలో పెను మార్పులు తీసుకురావడం ఖాయం’ అని చెబుతున్నప్పుడు హరిప్రియ కండ్లలో మెరుపు.
డ్రోన్ సేద్యంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. ఇప్పటికే ముగ్గురికి శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలట్ల్లుగా నియమించుకున్నాం. భవిష్యత్లో మరింత మందిని ఈ మార్గంలో నడిపిస్తా. ఎందుకంటే వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం. పైగా డ్రోన్ నిర్వహణ చాలా సులువు. స్మార్ట్ఫోన్ వాడటం తెలిస్తే చాలు. ఎవరైనా డ్రోన్ను ఆపరేట్ చేయవచ్చు. కనీసం పదివేలమందికి శిక్షణ ఇవ్వాలన్నది మా ఆశయం. మా విజయంలో వీహబ్ పాత్ర కీలకమైంది. వీహబ్లోకి వచ్చాకే డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలమన్న ధైర్యం వచ్చింది.
– హరిప్రియా రెడ్డి, సీయీవో ( blubot.co.in )
...? డప్పు రవి
చిన్నయాదగిరి గౌడ్
Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
“తైక్వాండోలో దూసుకెళ్తున్న తెలంగాణ ఆడబిడ్డ.. ఒలింపిక్స్లో మెడల్ సాధించడమే లక్ష్యం!”
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”