Kanna Ooru | పోలీసు ఉద్యోగం అంటేనే.. తీరికలేని బాధ్యతలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిళ్లు. అయినా సరే, ఉన్నకొద్దిపాటి వ్యక్తిగత సమయాన్ని కూడా సమాజానికి కేటాయిస్తున్నారు కొందరు అధికారులు. విద్యార్థులు, బధిరులు, వృద్ధులు, ఆపన్నులకు అండగా నిలుస్తూ ‘కన్న ఊరు’ రుణం తీర్చుకుంటున్నారు!
వాళ్లంతా 2009లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సబ్-ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగాలు సాధించారు. శిక్షణ పూర్తిచేసుకొని 2010లో నియామక ఉత్తర్వులు అందుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో కొలువులు. వృత్తిరీత్యా నిత్యం సవాళ్లే. కానీ బాధ్యతను మరువలేదు. తాము ఈ స్థాయికి రావడానికి కారణమైన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో ‘కన్న ఊరు’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి… నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఆ నిర్ణయం వెనుక ఓ మంచి నేపథ్యమూ ఉంది.
ఒక ఏడాది.. కామారెడ్డిలోని సాయిచరణ్ ఓల్డేజ్ హోంను ఆర్థికంగా ఆదుకున్నారు. ఏడాది పొడవునా నిత్యావసరాల కొనుగోలుకు సహకరించారు. ఒక ఏడాది.. ఆర్మూర్ సీఎస్ఐ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించారు. ఒక ఏడాదిలో కామారెడ్డిలోని ఓ వృద్ధాశ్రమం పిలుపునకు స్పందించి సాయం చేశారు. ఒక ఏడాది గురుకుల పాఠశాల విద్యార్థులకు బెంచ్లు, కుర్చీలు, పుస్తకాలు, సైకిళ్లు అందించారు. ఇలా ఏదో ఓ కార్యక్రమం. నిజామాబాద్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమం, చింతకుంటలోని శరణాలయం .. అనేక సంస్థలకు మేమున్నామంటూ బాసటగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా చౌట్పల్లి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు, తాండూర్ పాఠశాలలోని పేద పిల్లలకు, కామారెడ్డి జిల్లా దోమకొండ ఫరీద్పేట స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు, పాఠ్య పుస్తకాలు అందించారు. తెలంగాణ సర్కారు దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుండటంతో.. పేద కుటుంబాలకు చెందిన యువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా ఆర్థిక సహకారం అందించాలని భావిస్తున్నది ‘కన్న ఊరు’.
ఒక ప్రమిద వేయి దీపాలను వెలిగిస్తుంది. ఓ మంచి ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. 2009 ఎస్సై బ్యాచ్ పోలీస్ అధికారుల ‘కన్న ఊరు’ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ సేవలు ఎంతోమంది సిబ్బందికి స్ఫూర్తిమంత్రంలా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వైరల్గా మారుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పలువురు కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి సేవలకు పూనుకున్నారు. ఇలా ఇప్పటివరకు మూడు బ్యాచ్లకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు ఉమ్మడి జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 2009 పోలీస్ అధికారులు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ కింది స్థాయి ఉద్యోగులకు స్ఫూర్తిమంత్రాన్ని బోధిస్తున్నారు. సేవా కార్యక్రమాలు .. పాజిటివ్ అంటువ్యాధి లాంటివి. ఒకరి నుంచి ఒకరికి, ఒక బ్యాచ్ నుంచి మరో బ్యాచ్కు విస్తరిస్తూనే ఉంటాయి. నలుగురికీ సాయం చేయాలన్న సంకల్పాన్ని ప్రసాదిస్తూనే ఉంటాయి.
ఒకే జిల్లా. ఒకే బ్యాచ్. మొత్తం ముప్పై ఎనిమిదిమంది ఎస్సైలు. చాలామంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే. కష్టపడి జీవితంలో నిలదొక్కుకున్న వారే. హైదరాబాద్ పోలీస్ శిక్షణాలయం అందర్నీ కలిపింది. కలిసి కఠోర సాధన చేసేవారు. కలిసి భోంచేసేవారు. కలిసి సాయంత్రాలు కబుర్ల్లు చెప్పుకొన్నారు. దీంతో అనుబంధం బలపడింది. శిక్షణ అనంతరం 2011 జనవరిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జన్మనిచ్చిన ఊరికి, ఉనికినిచ్చిన జిల్లాకు ఏదో రకంగా సాయం చేద్దామని ఆ బృందంలో ఓ సభ్యుడైన కె.ఎస్.రవి ప్రతిపాదించారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. తలా వేయి రూపాయల చొప్పున సమీకరించారు. మొత్తం రూ. 38వేలు వసూలైంది. అనుకున్నదే తడవుగా ఈ మొత్తాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహా సొసైటీకి అందించారు. ఆ మొత్తంతో మానసిక వికలాంగులైన చిన్నారులకు తోడ్పాటు అందించారు. కాలం గడిచేకొద్దీ.. బాధ్యతలు పెరిగాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించాయి. పదోన్నతులూ వరించాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా అందుకున్నారు. అయినా, అలనాటి ప్రమాణాన్ని మరిచిపోలేదు. తామ ఆర్థిక సాయాన్ని మరింత పెంచారు.
– జూపల్లి రమేష్రావు
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
“కంప్యూటర్లో మనం వాడుతున్న తెలుగు ఫాంట్ క్రియేట్ చేసింది వీళ్లే..”
India Pride Project | దేవుళ్లకు రక్షకుడు ఈయన.. ఇంతకీ ఏం చేస్తాడు?”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”