ఐదేండ్ల క్రితం.. మధ్యప్రదేశ్ లోని ఒక రైల్వేస్టేషన్. పెచ్చులూడి, పిచ్చిమొక్కలు మొలిచి, పాకురు పట్టి ఉండేది. ప్లాట్ఫామ్లో పేడకంపు. గోడలనిండా పిచ్చిరాతలు. ఈగలు, దోమలు, కీటకాలతో కిటకిటలాడేది! ప్రయాణికులు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. ఓ యువకుడి చొరవ ఆ సమస్యను పరిష్కరించింది.
భవిష్యత్లో రైల్వేస్టేషన్లు చెత్త కేంద్రాలుగా మారతాయని భయపడ్డాడు ఇండోర్కు చెందిన నీలేశ్. ఒంటిచేత్తో రైల్వే ప్లాట్ఫామ్స్ సుందరీకరించాలనే ఆలోచన వచ్చింది అతనికి. స్నేహితుడితో చర్చించాడు. ఇద్దరూ రైల్వే అధికారులను కలిసి సుందరీకరణ ప్రతిపాదన చేశారు. సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించే విధంగా త్రీడీ పెయింటింగ్స్తో తీర్చిదిద్దేందుకు అనుమతి సంపాదించారు.
నీలేశ్ సివిల్ ఇంజినీర్. ‘సత్రంగి క్రియేషన్స్’ అనే సంస్థ ద్వారా భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. నీలేశ్ ఐడియా నచ్చడంతో అధికారులు ఐదు స్టేషన్ల కాంట్రాక్టు చేతిలో పెట్టారు. ఒకే ఒక్క షరతు.. రైల్వే నుంచి ఎలాంటి నిధులూ సమకూర్చరు. సొంతంగా ఖర్చు చేయాల్సిందే. అయినా వెనకడుగు వేయలేదు నీలేశ్. తనతోపాటే చదువుకున్న ఐదుగురు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులను పోగుచేసి పనులు ప్రారంభించాడు. చాలా తక్కువ బడ్జెట్తో రైల్వే స్టేషన్ను అందంగా మార్చాడు. దీంతో అధికారులు ఫిదా అయ్యారు. ఐదుగురితో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు 145 మంది కళాకారులు ఉన్నారు.
మొదటి ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో నీలేశ్పై రైల్వేశాఖకు పూర్తి నమ్మకం ఏర్పడింది. వార్తాపత్రికలు, టీవీ చానెల్స్ ద్వారా విస్తృత ప్రచారం జరగడంతో రెండో ప్రాజెక్ట్ వెతుక్కుంటూ వచ్చింది. అదే నీమచ్ రైల్వే స్టేషన్ సుందరీకరణ. నీమచ్ పట్టణం కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) ప్రధాన కేంద్రం కావడం విశేషం. సీఆర్పీఎఫ్ అధికారులు వెంటనే రూ.2.5 లక్షలు మంజూరుచేశారు. దీంతో రైల్వే శాఖలో నీలేశ్ బృందం త్రీడీ పెయింటింగ్స్ గురించి తెలిసిపోయింది. అలా వాళ్లు ఇప్పటివరకు 48 స్టేషన్లకు సొబగులద్దారు.
రైల్వేల సుందరీకరణ కోసం నీలేశ్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. త్రీడీ పెయింటింగ్ ద్వారా స్థానిక దృశ్యాలను పరిచయం చేయడానికి రైలు బండ్లను మంచి మాధ్యమంగా భావించాడు. ఒక్కో స్టేషన్లో ఒక్కో విధమైన స్థానిక కుడ్య చిత్రాలను వేస్తున్నారు. నీమచ్ స్టేషన్లో నందన బ్లాక్ ప్రింటింగ్, ఇండోర్లో రాణి అహల్యాబాయి పెయింటింగ్, చిత్తోర్గఢ్లో రాణాప్రతాప్, ఘూమర్ జానపద నృత్యం, జల్గావ్లో అజంతా ఎల్లోరా పెయింటింగ్ను జోడించారు. నార్వే ఆర్ట్ కౌన్సిల్ నీలేశ్ బృందం వేస్తున్న త్రీడీ పెయింటింగ్స్ను గుర్తించింది. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా నేరుగా ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది.
India Pride Project | దేవుళ్లకు రక్షకుడు ఈయన.. ఇంతకీ ఏం చేస్తాడు?”
కాళ్లు, కండ్లు లేకపోయినా నలుగుర్ని నడిపిస్తున్నరు.. వైకల్యానికే సవాలు విసురుతున్నరు”
“అమెరికా అధ్యక్షుడికే పట్టు శాలువాను పంపిన సిరిసిల్ల యువకుడు చేసిన అద్భుతాల గురించి తెలుసా”
“నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”