Telu Vijaya | జానపదాలతో మొదలై.. ఉద్యమ గీతాలతో ఉవ్వెత్తున లేచి.. బతుకమ్మ పాటలకు బ్రాండ్ అంబాసిడర్గా మారి.. తెలంగాణ సాంస్కృతిక పునర్ వైభవానికి కృషి చేస్తున్నది తేలు విజయ. పాట కోసం ఉద్యోగం వదులుకొని.. సినిమాల్లో తెలంగాణ పాటను మార్మోగించి.. ప్రపంచ వేదికల మీద పల్లెపాట పరిమళాలను వెదజల్లుతున్న జానపద తేజం తేలు విజయ పాటల ముచ్చట.
మాది కరీంనగర్. తల్లిగారి ఊరు ముల్కనూరు. అమ్మ నర్సమ్మ, బాపు తేలు వెంకటరాజం. అమ్మమ్మ మంచి పాటగత్తె. నేను ఎక్కువ కాలం తన దగ్గరనే పెరిగిన. తన దగ్గరనే జానపదాలు నేర్చుకున్న. అమ్మ బతుకమ్మ పాటలు నేర్పింది. బాపు దగ్గర ఎక్కువగా భజన పాటలు వినేదాన్ని. పదో తరగతి వరకు బడిలో దేశభక్తి గీతాలు పాడేదాన్ని. క్రమంగా జానపదాల వైపు మళ్లిన. ఇంటర్, డిగ్రీకి వచ్చేసరికి కొంత సీరియస్ పాటలపై దృష్టిపెట్టిన. చదువుకు ఆటంకం కలగకుండా పాటను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్న. ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు సందేశం కూడా ఇస్తుండేవాళ్లం. మిగతా సభ్యులు ప్రసంగాలు చేస్తుంటే, నేను మాత్రం పాట ద్వారా నా మనసులోని భావాలు చెప్పేదాన్ని.
అది 1998. గుడుంబా పచ్చని కాపురాల్లో చిచ్చువెడ్తున్నది. కూలీచేస్తే వచ్చిన పావలో పరకో సారా తాగనీకె ఖర్చు పెడుతుండటంతో మహిళా లోకం తిరగబడింది. ప్రజల్లో మరింత చైతన్యం కోసం క్యాసెట్లు తీస్కొచ్చిండ్రు. ఆ ప్రయత్నంలో వచ్చిందే ‘నగారే మోగింది’ ఆడియో క్యాసెట్. పాటలు, సింగర్స్ ఎంపిక జరుగుతున్నది. నా పాటలు విన్న మా సీనియర్ వడ్లకొండ అనిల్ కుమార్ నేను అందులో పాడితే బాగుండని అనుకున్నడంట. క్యాసెట్ తీసుకొస్తున్న బోగం సుమంత్కు ‘మా కాలేజ్లో ఒక అమ్మాయి బాగా పాడుతది. మీ
కాన్సెప్ట్కు సరిగ్గా సెట్టయితది’ అని చెప్పేసరికి, సుమంత్ నన్ను పిలిపించిండు. కొన్ని పాటలు పాడి వినిపించిన. మొత్తానికి ‘నగారే మోగింది’ కోసం ఎంపికైన. క్యాసెట్ మీద నా పేరు చూసుకొని మురిసిపోయేదాన్ని. అందులోని ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు.. ఈపువలగ్గొడ్తాండు ఇల్వదీసుకుంటాండు’ పాట ఇరవయ్యేండ్లు గడిచినా ప్రజాదరణ పొందుతూనే ఉన్నది.
2001 నాటికి నాకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నా. అదే సంవత్సరం నా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు.. నా పాట నచ్చి తొలిసారి క్యాసెట్లో పాడనీకె అవకాశం ఇచ్చిన బోగం సుమంత్ కుమార్తో నా పెండ్లయ్యింది. తర్వాత జానపదాలపై పూర్తిగా దృష్టిపెట్టిన. చిన్నప్పుడు విన్న, నేర్చుకున్న పల్లె పాటలను ఫైల్ చేసి పెట్టుకున్న. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ ఉన్నా. పాటపై పట్టు, ఉద్యమంపై ధ్యాస ఉన్న నాకు 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో పాడిన ‘ఊరికి ఉత్తరానా వలలో.. ఊడాలామర్రీ వలలో’ పాట నా కెరీర్కు టర్నింగ్ పాయింట్. అదే సంవత్సరం ‘పల్లెపాట’ కార్యక్రమంలో భాగంగా దుబాయ్లోని మనవాళ్లు ఆహ్వానించిండ్రు. పక్కూరికి పోనీకి కూడా అవకాశం లేని నాకు పాట ద్వారా దుబాయ్ వెళ్లే అవకాశం రావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండె.
ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్లింది. ‘అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా’, ‘తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడుడే’, ‘ఇస్తననీ చెప్పుడేంది తెలంగాణ’ వంటి ఎన్నో ఉద్యమ గీతాలతో ప్రజలను చైతన్యం చేసిన. సీఎం కేసీఆర్గారు ఏర్పాటుచేసిన ‘టీఎస్ఎస్’లో చేరి తెలంగాణ సాంస్కృతిక వైభవంలో నావంతు పాత్ర పోషిస్తున్నా. సినిమాల్లో పది పాటల వరకూ పాడిన. ఇవన్నీ ఒకెత్తయితే 2015లో వచ్చిన ‘పచ్చపచ్చని పల్లె పచ్చాని పల్లె మబ్బుల్లో లేసింది.. వాకిల్లూ ఊడ్చీ ముగ్గుల్లు వెట్టిందీ’ బతుకమ్మ పాట ఒకెత్తు. ఇది నన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇప్పటి వరకు ఎనభై వరకూ బతుకమ్మ పాటలు పాడిన.
అమెరికా, ఆస్ట్రేలియా, మస్కట్, ఖతార్ లాంటి దేశాల్లో నా గళం వినిపించిన. ఉత్తమ ఉద్యమ గాయనిగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న. ‘తేలు విజయ ఛానెల్’ ద్వారా ఎన్నో పాటలు విడుదల చేసిన. ‘వదినే నువ్వొచ్చినాల్లా’ పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘కడుపులో పుట్టిన నా కొడుకుల్లారా’ పాటను మదర్స్డే స్పెషల్గా తీసుకొచ్చిన. చిన్నప్పటినుంచి సేకరించి, రాసిపెట్టుకున్న పాటలు చాలానే ఉన్నయి. ఆ నిధిని సమాజానికి పరిచయం చేసేదాక వదలను. నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి పాటకు ఎక్కడ దూరమవుతానో అన్న భయంతో రాజీనామా చేసిన. రెండు పీజీలు చేసినా కూడా చదువుతో రాని గుర్తింపు పాట ద్వారానే వచ్చింది. అందుకే పాటను విడిచిపెట్టొద్దని గట్టిగా నిశ్చయించుకున్న.
…? దాయి శ్రీశైలం
“Marupaka Sanjana | మల్లెమొగ్గలా తీరు.. రాధమ్మ బంగారు బొమ్మా!”
“Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”
“మట్టిలో మాణిక్యం సాయికుమార్గౌడ్..పాటలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న గద్వాల బాలుడు!!”
“అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”