Janaki Srinivas | మూడో తరగతిలోనే ఆ చిన్నారిపాటకు.. ‘అరుణోదయ’ ఆశ్చర్యపోయింది. అప్పుడే తెలిసింది తనకు అదొక విప్లవ గీతమని. అనూహ్య స్పందన తర్వాత అర్థమైంది తనదొక అరుదైన గొంతుక అని. ఆ గొంతుకే తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చింది, జానపద ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్నది. పాట వల్ల కోల్పోయిన జీవితాన్ని, అదే పాటతో తిరిగి పొందిన గాయని జానకీ శ్రీనివాస్ పాటల ముచ్చట!
మాది నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు. నాన్న గోగుల రాములు. అమ్మ ఇద్దమ్మ. మూడో తరగతిల ఉన్నప్పటి నుంచే పాడుతున్న. మా మేనత్తలను చూసి నేనూ నేర్చుకున్న. బళ్లో జరిగే కార్యక్రమాలతో నా పాటల ప్రయాణం మొదలైంది. ఒకసారి ఊర్లో అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ‘దండెనకా దండొచ్చే ఎర్రాదండొచ్చే పోరాటదారుల్లో..’ పాట ఊరంతా మార్మోగింది. నాకూ బాగా నచ్చింది. అప్పటికి మూడో తరగతి చదువుతున్న. పాట అర్థమేందో కూడా తెల్వదు. కానీ ఊకె నోట్ల నానేది. ఓ రోజు మా అక్క బోరింగ్ కాడికి నీళ్లకు పోయింది. చంటోడు ఏడుస్తున్నడు. ఉయ్యాలలో వేసింది అక్క. బోరింగ్ కాడి నుంచి ఇంటి కొచ్చేందుకు గంట సమయం పట్టేది. ఉయ్యాల ఊపమని నాకు చెప్పి వెళ్లింది. ఎంత ఊకోబెట్టినా అట్లనే ఏడుస్తున్నడు. రెండుమూడు జోల పాటలు పాడిన. ఆ తర్వాత ‘దండెనకా దండొచ్చే ఎర్రాదండొచ్చే’ పాట పాడిన. చంటోడు ఊరుకున్నడు. అక్కడినుంచి వెళ్తున్న కప్పల వసంతక్క చెవిలో పడింది నా పాట. వసంతక్క, ఆమె భర్త క్రిష్ణన్న సీపీఐఎంఎల్ జనశక్తిలో చేసేవాళ్లు. ‘ఆ పాట రేడియోలనా? ఎవరైనా పాడుతుండ్రా?’ అని ఎవర్నో అడిగితే ‘గోగుల రాములు చిన్న బిడ్డక్కా’ అని చెప్పిండ్రంట. పొద్దుమూకంగా బోరింగ్ కాడికి నీళ్లకు వోయినప్పుడు వసంతక్క నన్ను పలకరించింది. ‘ఏం చదువుతున్నవ్ బుజ్జీ’ అన్నది. వెంటనే ‘పాటలు కూడా మస్తు పాడుతున్నవ్రా’ అనేసరికి నాకు ఆశ్చర్యమనిపించింది. ‘నాతోపాటు తీస్కెళ్త వస్తవా’ అన్నది. ఏదో సరదాకు అడుగుతుంది కదా అని ‘సరే అక్కా’ అని చెప్పి ఇంటికొచ్చిన. కొన్ని రోజులకు అరుణోదయ సాంస్కృతిక వేదికపై పాడే అవకాశం వచ్చింది. వేదిక కింద వందల మంది ఉన్నరు. ఎలాంటి బెరుకు లేకుండ పాడిన. నిజానికి అది ప్రజల కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరుని స్మారక గీతం.
ఉద్యమ సంఘాలతో కలిసి పాడటం మొదలుపెట్టిన. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా నన్ను తీసుకెళ్లేవాళ్లు. నా పాట గురించి ఊరూరా తెలిసిపోయింది. ఇదే నాకు సమస్య అవుతుందని మాత్రం నేను అనుకోలేదు. నా పాటలంటే అమ్మకు చానా ఇష్టం. మేమిద్దరమే ఉన్నప్పుడు నాతో పాడించి ఆనందపడేది. నాన్నకు కూడా పాటలు ఇష్టం. కానీ ఎవరూ నన్ను పెండ్లి నుంచి తప్పించలేక పోయిండ్రు. వాళ్లేమనుకుంటరో, వీళ్లేమనుకుంటరో అన్న భయంతో నాకు తెల్వకుంటనే మా మేనబావతో మాటముచ్చట చేసిండ్రు. అట్లా చదువు పూర్తి కాకుండనే, చిన్న వయసులనే పెండ్లి జరిగిందనే దిగులు ఎప్పుడూ ఉండేది. ఆ ఆలోచనల నుంచి బయటపడేందుకు మళ్లా పాటనే ఆశ్రయించిన. మా ఆయనకు నా అభిరుచి ఏంటో తెలుసు కాబట్టి నన్నూ నా పాటనూ ప్రోత్సహిస్తూ వచ్చిండు.
పిల్లలు కొంచెం పెద్దగైనంక బయట ప్రోగ్రామ్స్కు వెళ్లడం మొదలుపెట్టిన. నకిరేకల్లో షిరిడీ తర్వాత అంత పెద్దదైన సాయిబాబా గుడి ఉంటది. నాకెందుకో అక్కడొక పాట పాడాలని అనిపించేది. ఒకసారి వాళ్లే ‘ఎవరైనా పాటలు పాడండి’ అని అనౌన్స్ చేసిండ్రు. మైక్లో నా పాట విని అందరూ మెచ్చుకున్నరు. ‘సాయిబాబా భక్తిగీతాలతో నిర్వహించే ఆర్కెస్ట్రాలో పాల్గొంటవా’ అని అడిగిండ్రు. అట్లా భక్తిగీతాలు కూడా పాడటం అలవాటైంది. అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా మా బృందంతో కలిసి వందలాది వేదికలపై ఉద్యమగీతాలు పాడిన. ప్రస్తుతం, సాంస్కృతిక సారథిలో దరఖాస్తు చేసుకున్నా. అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నా.
యూట్యూబ్లో పాడాలని అనుకుంటున్న సమయంలో మా దోస్త్ ఒక చానెల్కు కాల్ చేసి అడిగింది. సిరిపంగి రవి నన్ను రాచకొండ రంగన్నకు పరిచయం చేసిండు. నా దగ్గర సేకరణ పాటలు చాలా ఉన్నాయని చెప్పిండట. రంగన్న అమూల్య స్టూడియోస్కు తీసుకెళ్లిండు. అక్కడ నేను మొదలు పాడిన పాట.. ‘ఆత్రంగ పోతున్నవ్ ఏ ఊరు పిల్లో’. తర్వాత ‘రావే రావే నల్లతుమ్మెదా.. నీవు రావే నాటెయ్యంగ తుమ్మెదా’ పాడిన. ఈ పాట మా మేనత్త దగ్గర సేకరించిన. ‘ఎద ఎదా ఎదనుకుంటా’ పాటకూ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ‘జీఆర్ టీవీ మ్యూజిక్’ అనే చానెల్ పెట్టుకొని నేనే పాటలు తీస్తున్నా. ‘కొమ్మల ఫలమున్నదో ఉయ్యాలా.. కోరితే ఏమొచ్చునో ఉయ్యాలా’, ‘డప్పులు డప్పులురో ఓ మామో నాగులయ్యా’, ‘మనము కలుసుకున్న రోజులూ యాది కొస్తెరో’.. నాకు పేరు తెచ్చిన పాటలు. పాట ద్వారానే ఇక్కడి దాంక వచ్చిన నేను, అలనాటి పల్లె పాటలను ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్న.
…?దాయి శ్రీశైలం
“Bhavani Sangareddy | నా అందం సూడుబావయ్యో!”
“మట్టిలో మాణిక్యం సాయికుమార్గౌడ్..పాటలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న గద్వాల బాలుడు!!”
“అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”