Bhavani Sangareddy | జానపదం ఆమెకు సంగీతాన్ని పరిచయం చేసింది. మనసుకు నచ్చిన వ్యక్తితో మనువు జరిపింది. అమ్మ ప్రేమను, నాన్న కరుణను తమ్ముండ్లకు పంచేలా చేసింది. క్లిష్ట పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్పింది. విజయ పరిమళాన్నీ చవిచూపింది. పల్లెదనం ఉట్టిపడేలా సక్కదనాల పాటలు పాడుతున్న సంగారెడ్డి భవాని పాటల ముచ్చట!
మాది సంగారెడ్డి లోకల్. నాన్న కానిస్టేబుల్గా చేస్తుండె. అమ్మ కూడా ఉద్యోగం చేసేది. మా తాతవాళ్లు జానపద కళల్లో ప్రవీణులని నాన్న చెప్తుండె. అదే నాకు వారసత్వంగా అబ్బిందేమో. నాన్న పాడకపోతుండె గానీ ఒగ్గుకథలు, పల్లె పాటలంటే ఇష్టపడుతుండె. అమ్మ మంచిగా పాడేది. నాన్న ఎక్కడికి బదిలీ అయితే మేం అక్కడికి వెళ్లేవాళ్లం. ఒగ్గుకథలు, బుర్రకథలు, కోలాటాలు చూడనీకె ఎడ్లబండ్లలో వెళ్తుంటిమి. ఆ కథలు, పాటలు ఇంట్ల పాడుకునేదాన్ని. పంద్రాగస్టు, చబ్బీస్ జనవరికి నాన్నకు పరేడ్ గ్రౌండ్స్లో డ్యూటీపడేది. ‘నాన్నా నేనూ వస్తనే. స్టేజి మీద పాడుతా’ అని బతిమిలాడితే ‘సరే’ అంటుండె. అంతమందిలో పాడటం అనేది నా వరకు గొప్ప వరంగా అనిపించేది. అసొంటి అవకాశాలు చిన్నప్పుడే మస్తు దక్కినయి. నాన్న ఏమనకపోతుండె. కానీ అమ్మనే ‘సక్కగ సదువుకొని మా లెక్క కొలువులు చెయ్యక ఈ పాటల లొల్లేంది’ అంటుండె.
నా పాటలు నచ్చి నన్ను ప్రోత్సహించిన మొదటి వ్యక్తి శేఖర్. మేనమామ వరుసవుతడు. అప్పట్లోనే డోలక్, తబలిస్ట్గా ఆయనకు మంచిపేరు ఉండేది. కళా రంగమే కాబట్టి నా తపన అతనికి అర్థమైంది. ‘నీ గొంతే నీకు వరం. ఎట్లాంటి ప్రాక్టీస్ లేకుండా, సంగీతంలో శిక్షణ తీసుకోకున్నా.. ఇంత మంచిగ పాడుతున్నవంటే నిజంగా గ్రేట్’ అని పాట విన్న మొదటి రోజే చెప్పిండు. ప్రాక్టికల్ ఎక్స్పీరియెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మొదాలు సంగారెడ్డి కళాకారుల బృందంలో చేర్పించిండు. అక్కడికెళ్లినంకనే నాకు పాట పరమార్థం తెలిసింది. జానపదంతో మొదలైన నా ప్రస్థానం అన్ని రకాల పాటలు పాడే దాకా వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వెళ్తుండేదాన్ని.
నాన్న ఉన్నట్టుండి చనిపోయిండు. గుండెల్లో పిడుగు వడ్డట్లు అయ్యింది. డిప్రెషన్కు గురైన. ఇంట్లనే ఉండేదాన్ని. విషయం శేఖర్కు తెలిసింది. ‘నాన్నకు నీ పాటంటే ఇష్టమేగదా? నీ కళను సానవెట్టి రాణిస్తేనే ఆయన ఆనందపడ్తడు. ఇవన్నీకాదు గానీ సంగీతం నేర్చుకుందువు వచ్చెయ్’ అన్నడు. అమ్మ కూడా నేర్చుకోమన్నది. జానపదమంటే ప్రాణంలెక్క భావించిన నాకు, సంగీతం కొత్తదారి చూపింది. త్యాగరాజ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న. సంగీతం నిజంగనే డిప్రెషన్ను దూరం చేసింది. ఇంతలో మాటీవీ ‘పాడాలని ఉంది’లో అవకాశం వచ్చింది. అప్పుడే కెరీర్ అంటే స్పష్టత వచ్చింది. సమస్యల్లో తోడుంటూ.. నా పాటను, నన్ను మెచ్చిన శేఖర్తో జీవితం పంచుకోవాలని అనుకున్నా. అమ్మతో మాట్లాడి పెండ్లి చేసుకున్నం. శేఖర్ నా జీవితంలోకి వచ్చినంక నా పాట మరో మెట్టు పైకెక్కింది.
కరీంనగర్లో ఓ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రెండుమూడు రోజులకు ఓ ఫోన్కాల్ వచ్చింది. అక్కడ నా పాట విన్నరంట. సార్పేరు తెల్లా మురళి. నేనెవరో తెలవకపోయినా నా చేత పాడించేందుకే ప్రత్యేకంగా ఒక పాట రాసిండ్రంట. నాకే ఆశ్చర్యమనిపించింది. ‘బేటీ బచావో బెహనా.. బేటీకో పడాతే రహనా’ పాట అది. ఇక ఉద్యమ వేదికలమీద రసమయన్న పాట ‘అసోయ్దులా హారతి.. కాళ్ల గజ్జెల గమ్మతి’ ఎక్కువగా పాడేదాన్ని. జానపదాలైతే ‘రాళ్ల నెకిలేసు పెట్టేటిదాననురా’, ‘రాగిసెట్టెక్కేడు రాగాలు తీసెడు’, ‘నా అందం సూడు బావయ్యో’.. పాడేదాన్ని. పాటల ప్రయాణాన్నిలా కొనసాగిస్తూనే పల్లె సంప్రదాయాన్ని మర్చిపోవద్దని పాడి పశువును పెంచుకుంటున్నా. పండువెన్నెల పల్లె నిండ రాలుతుంటే మనుసు నిండి పొంగుతుంటది నాకు. ఇన్ని పాడిన నేను సినిమాలకు ఎందుకు పాడొద్దని ప్రయత్నాలు చేస్తున్నా. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
జీవితం హాయిగా సాగిపోతున్నదని అనుకుంటుండగానే అమ్మ కాలం చేసింది. నేను బాధపడుతూ కూర్చుంటే నా ముగ్గురు తమ్ముండ్లు ఆగమైతరు. ఇగ వారికి అమ్మానాన్న అన్నీ నేనే. ఈ విషయంలో నా భర్త శేఖర్, అత్తామామలు గొప్ప మనసు చాటుకున్నరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నిండు గర్భిణిగా ఉండి వేదికలెక్కి ఆడిపాడిన. నా కష్టాన్ని, నా కసిని రసమయి బాలకిషనన్న కండ్లార చూసిండ్రు. నేను ప్రొఫెషనల్గా పాడిన తొలి జానపదం కూడా రసమయన్న పాటనే. ‘జబ్బకు గొంగడి.. నెత్తికి రుమాల్.. గొల్లావారమే.. మేమెర్రా గొల్లావారమే’ అంటూ సాగే పాట అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. భవిష్యత్తులో మరిన్ని మంచి జానపద పాటలు పాడి.. పేరు తెచ్చుకుంటా.
…? దాయి శ్రీశైలం
“మట్టిలో మాణిక్యం సాయికుమార్గౌడ్..పాటలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న గద్వాల బాలుడు!!”
అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే”
“శెనగచేన్ల నిలావడి చేతులియ్యావే.. దాసరి సంధ్య పాట ముచ్చట!”