Allola Divya Reddy | ఆవులు ఆమె నేస్తాలు. వాటితో సంభాషిస్తారు. వాటి మధ్య తనను తాను మరిచిపోతారు. అందులోనూ గిర్ ఆవులు మన సిరిసంపదలని భావిస్తారు అల్లోల దివ్యారెడ్డి. ఆమె స్థాపించిన ‘క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్’ స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తుల తయారీ సంస్థ మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణ ఉద్యమ వేదిక, దేశవాళీ పశుసంపద సంరక్షణ కేంద్రం కూడా.
‘పిల్లలకు ఆవుపాలు చాలా శ్రేష్ఠం. అందులోనూ దేశీ ఆవు పాలలో ఏ2 బీటా కేసీన్ అనే ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇది పెద్దలకూ మంచిదే’- ఆవుపాల గొప్పదనాన్ని వివరిస్తున్నప్పుడు ఆమె గొంతులో తన్మయత్వం. అదే అల్లోల దివ్యారెడ్డిని డెయిరీప్రెన్యూర్గా మార్చింది. తొలి ప్రయత్నంగా ఆమె దేశవాళీ గిర్జాతి ఆవులతో ఇంట్లోనే చిన్నపాటి డెయిరీ ఫామ్ ప్రారంభించారు. అపారమైన పోషక విలువలు కలిగిన ఆవుపాలను తన పిల్లలకు అందించారు. ఫలితాలు అద్భుతంగా అనిపించాయి. బిడ్డల ఎదుగుదలలో ఎంతో మార్పు కనిపించింది. దీంతో పాడి రంగంపట్ల ఆసక్తి పెరిగింది. ఆవుల సంరక్షణ, పాల సేకరణ, సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కోసం దివ్యారెడ్డి గుజరాత్, రాజస్థాన్ పర్యటించారు. అనేక గోశాలలను, డెయిరీ ఫామ్లను సందర్శించారు. డెయిరీ టెక్నాలజీ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. పాడి రంగం మీద సమగ్రమైన అవగాహన వచ్చిందన్న నమ్మకం కలిగాక.. సంగారెడ్డి సమీపంలో ‘క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్’ను ప్రారంభించారు. అప్పటికే గిర్ ఆవుల పోషణపై తగిన అవగాహన ఉండటంతో.. ఆ జాతి పశు సంపదవైపే మొగ్గు చూపారు. పాలతోపాటు నెయ్యి, మిఠాయిలు, పనీర్ లాంటి ఉత్పత్తులను సైతం నాణ్యతలో రాజీ పడకుండా అందిస్తున్నారు. లాభాల కంటే నైతిక విలువలే ముఖ్యమని భావిస్తున్నారు.
రసాయనాల విపత్తు నుంచి నేలతల్లిని రక్షించుకునేందుకు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించారు దివ్యారెడ్డి. తన వ్యవసాయ క్షేత్రం కోసం ఆవుపేడ, గోమూత్రం నుంచి ఎరువులను తయారుచేస్తున్నారు. వీటిని తమ పంటపొలాల్లో ఉపయోగించడంతో పాటు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఆవుపేడతో అగరొత్తులు, పిడకలు, వినాయక విగ్రహాలు రూపొందిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మంచి జరుగుతుంది. ఎంతోకొంతమందికి ఉపాధి కూడా లభిస్తుంది.
క్లిమామ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గిర్జాతి ఆవుపాల పోషక విలువల గురించి జనంలో అవగాహన పెరుగుతున్నది. దీంతో రైతులు ఉత్సాహంగా ముందుకొచ్చి గిర్ ఆవులను పెంచుతున్నారు. తమ గోశాల నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 12 చోట్ల రైతులు గిర్ ఆవుల పెంపకాన్ని చేపట్టినట్లు దివ్యారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడ గిర్ ఆవులపై అవగాహన కార్యక్రమాలు జరిగినా.. దివ్యారెడ్డికి ఆహ్వానం అందాల్సిందే. సోషల్ మీడియా వేదికగానూ ఆమె గిర్ ఆవుల గొప్పతనాన్ని వివరిస్తున్నారు. అవసరమైతే జనంలోకి కూడా వెళ్తున్నారు. దివ్యారెడ్డి దృష్టిలో గిర్ ఆవుల సంరక్షణ.. ఓ సామాజిక బాధ్యత. ఆ చొరవను ప్రభుత్వం, సమాజం గుర్తించాయి. క్లిమామ్ ద్వారా ప్రజలకు, రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ‘రైతునేస్తం’ పురస్కారం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక గోపాల రత్న అవార్డు స్వీకరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా సన్మానం పొందారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో దుబాయ్లో ఐఎఫ్ఏహెచ్ పురస్కారం దక్కింది. మహిళా పారిశ్రామిక వేత్తల విజయగాథలతో రూపొందించిన ‘హర్ సెల్ఫ్- ఎ సక్సెస్ఫుల్ షీ’ అనే కాఫీటేబుల్ బుక్లోనూ దివ్యారెడ్డికి కొన్ని పేజీలు కేటాయించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోడలిగానే కాకుండా.. డెయిరీ ప్రెన్యూర్గా, సేంద్రియ ఉద్యమకారిణిగా, గో ఆధారిత సేద్యానికి ప్రచారకర్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దివ్యారెడ్డి.
‘మొదట్లో నా పిల్లలకు స్వచ్ఛమైన దేశీ ఆవుపాలు అందించాలనే ఉద్దేశంతో గోశాల ప్రారంభించాను. నా కుటుంబంతోపాటు ప్రజలూ ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతో నాణ్యమైన డెయిరీ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నాం. దేశీ ఆవుపాలపై చాలావరకు చైతన్యం తీసుకొచ్చాం. సేంద్రియ ఎరువులపై జనంలో అవగాహన వచ్చింది. అయినా చేయాల్సింది చాలానే ఉంది’ అంటున్నారు అల్లోల దివ్యారెడ్డి. ‘మనదైన, మహోన్నతమైన భారతీయతను మళ్లీ వెనక్కి తీసుకొద్దాం. ఆ ఉద్యమంలో మనమంతా భాగస్వాములమే’.. ఇది క్లిమామ్ నినాదమే కాదు, దివ్యారెడ్డి విధానమూ.
– భాకే రఘునాథ్రావు
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”