Re release Movies | రీ రిలీజ్లు పాత మాట! నలుపు-తెలుపు సినిమాలు రంగులు అద్దుకోవడమూ పాత ముచ్చటే! రీమాస్టరింగ్ ఇప్పుడు నయా ట్రెండ్. పాత సినిమాలకు డిజిటల్ మరమ్మతు చేసే ప్రక్రియ ఇది. రంగుల్లో గాఢత రంగరించి, మాటల్లో నాణ్యత పెంచి.. మరింత మన్నికగా సినిమాలను తీర్చిదిద్దుతున్నారు. కాలపరీక్షను తట్టుకోలేక చెదల బారినపడుతున్న సినిమా రీళ్లు.. సాంకేతికత పుణ్యాన డిజిటల్ హంగులను అద్దుకొని, ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
టాలీవుడ్లో సునామీ సృష్టించిన సినిమా పోకిరి. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం మహేశ్బాబు కెరీర్లో భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ప్రతీ రెండు వారాలకు ఏదో ఒక చానల్లో ‘పండుగాడు’ పలకరిస్తూనే ఉంటాడు. మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ఈ నెల 9న రిలీజైంది ‘పోకిరి’. అల్లాటప్పా విడుదల కాదిది. కొత్త సినిమా విడుదల అయిందన్నంత హంగామా చేశారు అభిమానులు. కటౌట్లు పెట్టారు. క్షీరాభిషేకాలు చేశారు. వీర తిలకం దిద్దారు. గుమ్మడితో దిష్టి తీశారు. థియేటర్లోకి వెళ్లాక సినిమాలోని ప్రతి సన్నివేశం అభిమానుల నుంచి రెట్టించిన అంచనాలు అందుకుంది. ప్రతి ఫ్రేమ్లోనూ 4కె రిజల్యూషన్ తాజాదనం కన్నులపండువ చేసింది.
పోకిరి రిలీజ్ నాటికి నిండా పదహారేండ్లు లేని యువత.. ఇప్పుడు ముప్పయ్ ఏండ్లకు చేరువైంది. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా! అయినా వారి అభిమానంలో మాత్రం ఏ మార్పూ లేదు. ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, వాడే పండుగాడు’ అంటూ హీరో పలికే డైలాగ్కు.. డిజిటల్ సౌండ్కు దీటుగా థియేటర్ అంతా దద్దరిల్లిపోయేలా ఈలలు వేశారు. గోలలు చేశారు. కాగితాలు చించేశారు. ఈ ముచ్చటంతా ఒకట్రెండు రోజులు మాత్రమే ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఒక ‘ట్రెండ్’ మొదలైందని మాత్రం చెప్పొచ్చు.
పాత సినిమాల రీమాస్టరింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు రూ.360 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2,200 సినిమాలను 4కె రిజల్యూషన్తో డిజిటలైజ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. భారతదేశ సంపదలో సినిమాలూ భాగమే. టీవీలు లేని రోజుల్లో సినిమా ప్రధాన వినోద సాధనంగా విరాజిల్లింది. టీవీలు వచ్చాక కూడా సినిమాల ప్రాభవం తగ్గలేదు. ప్రైవేట్ చానళ్ల జోరు పెరిగినా, ప్రతిరోజూ పదుల సినిమాలు ప్రసారం అవుతున్నా.. శుక్రవారం వచ్చిందంటే థియేటర్లు కిటకిటలాడే సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. ఓటీటీ దాడిలోనూ మంచి సినిమా వస్తే థియేటర్లు తట్టుకుని నిలబడుతున్నాయి. ఇన్ని మార్పుల్లో మళ్లీ పాత సినిమా థియేటర్లో విడుదలైతే ఎవరు చూస్తారు? అన్నది ప్రశ్న. కానీ, కలెక్షన్ల కోసం చేస్తున్న ప్రయత్నం కాదిది. తమ సినిమాను పదికాలాలపాటు భద్రంగా దాచుకోవాలనుకునే ఉద్దేశంతో రీమాస్టరింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. రీళ్లలో నిక్షిప్తమైన సినిమాను డిజిటల్ డిస్క్పై చిత్రీకరిస్తున్నారు. సాంకేతికత సాయంతో చిత్రిక పట్టి నాణ్యతను పెంచుతున్నారు.
సినిమా రీమాస్టరింగ్ ప్రక్రియ కూడా ఎప్పట్నుంచో ఉన్నదే! వీడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు ఇవన్నీ ఈ విధానం ద్వారా మార్కెట్లోకి వచ్చినవే! అయితే, ఇప్పుడు మరింత నాణ్యతతో థియేటర్లలో విడుదలకు అనుకూలంగా సిద్ధమవుతున్నాయి. 1992లో చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘ఘరానా మొగుడు’ కూడా డిజిటల్ సొబగులు అద్దుకుంటున్నది. చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా కూడా 4కె రిజల్యూషన్ సంతరించుకుంటున్నది. పవర్స్టార్ పవన్కళ్యాణ్ ‘జల్సా’ కూడా ఇదే బాటలో పయనిస్తున్నది. ప్రఖ్యాత సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సైతం రీమాస్టరింగ్పై ఆసక్తి కనబరుస్తున్నది. తమ సంస్థలో నిర్మితమైన సినిమాలన్నిటినీ డిజిటలైజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆణిముత్యాల్లాంటి సినిమాల రీళ్లు కాలక్రమంలో దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వాటి నాణ్యతను పెంచుకునే పనిలో పడింది. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సినిమాకు కొత్త లుక్ తేవడం వెనుక.. రీ రిలీజ్ చేయాలనో, కలెక్షన్లు చేయాలనో నిర్మాతల ఉద్దేశం కాదు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించిన సినిమాను పదిలంగా దాచుకోవడానికే ఈ ప్రయత్నమంతా. నిజమే, ఇప్పటికే చాలా కోల్పోయాం. ఎన్నో ఆణిముత్యాలు కనిపించకుండాపోయాయి.
టీవీల సందడి ఊపందుకోని రోజుల్లో సినిమాలు నాలుగు, ఐదేండ్ల తర్వాత రీ రిలీజ్ అయ్యేవి. వాటినీ జనాలు ఆదరించేవారు. మొదటి విడుదలలో పరాజయం పాలైన సినిమాలు సైతం రెండో విడుదలలో విజయవంతంగా ఆడేవి. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ వంటి పలు చిత్రరాజాలను సినీ వారోత్సవాల్లో ప్రదర్శించేవారు. వాటిని చూసేందుకు జనమూ ఎగబడేవారు. ఇక టాలీవుడ్ సినిమాల్లో మకుటాయమానంగా నిలిచిపోయిన ‘మాయాబజార్’ పన్నెండేండ్ల కిందట రీమాస్టరింగ్లో భాగంగా రంగుల చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త తళుకులు పులుముకున్న అలనాటి మేటి చిత్రాన్ని చూసేందుకు తాతలు, బామ్మలు పోటీపడ్డారు. బాలీవుడ్ చరిత్రలో మేటి చిత్రంగా పేరొందిన ‘మొఘల్-ఎ-ఆజమ్’ సినిమా సప్తవర్ణ రంజితమై 2004లో థియేటర్లలో సందడి చేసింది. నయాదౌర్, శ్రీ 420, హౌరాబ్రిడ్జ్, హమ్దోనో తదితర హిందీ సినిమాలు దశాబ్దాల తర్వాత రంగుల్లోకి మారి రీ-రిలీజ్ అయ్యాయి. ‘షోలే’ సినిమా కూడా 5.1 సరౌండెడ్ సౌండ్ టెక్నాలజీతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది.
హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలోని ‘అవతార్’ సినిమాను ఎవరూ మరచిపోలేరు. అదో ఆణిముత్యం. దాని సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 13 ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ‘అవతార్-2’ విడుదల కాబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘అవతార్’ మొదటి భాగాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నది ఆ చిత్ర నిర్మాణ సంస్థ. 4కె రిజల్యూషన్తో, మరింత క్లారిటీ విజువల్ ఎఫెక్ట్స్తో సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సినిమాలో చూపించిన పండోరా అందాలు నయా ‘అవతార్’లో ఇంకెంత గొప్పగా కనిపిస్తాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ‘చూడాల్సిందే’!
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ !!