కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్వీయ నియంత్రణ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం కనబర్చడం.. లాక్ డౌన్ పెట్టాలని దాదాపు అన్ని వర్గాలు చాలా రోజులుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ మరింత ఉధృతం కానున్నందున పది రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తోంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని కేబినేట్ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు కానున్న నేపథ్యంలో పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉండగా..ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం మేరకు యాదాద్రిలో స్వామి దర్శనాలను ఈ నెల 12 నుంచి 21 వరకు నిలిపివేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చర్యలు తీసుకుంటూనే.. లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాబినెట్లో చర్చించి లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ అమలు నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుండగా.. ప్రతి రోజూ 4 గంటల పాటు లాక్డౌన్కు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం 20 గంటల పాటు మాత్రం పకడ్బందీగా అమలు చేయాలని సంకల్పించింది. అత్యవసర సేవలకు మినహాయింపు నివ్వడంతో కూరగాయలు, నిత్యావసరాల కోసం జనం ఎగబడడంతో జిల్లాలోని పలు వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి.
20 గంటలు పకడ్బందీగా..
లాక్డౌన్ విధించిన రాష్టాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం.. లాక్డౌన్తో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతోపాటు పేదలకు ఉపాధి కరువవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూ మినహా మిగతా వేళల్లో ప్రజలు స్వీయ నియంత్రణను పాటించక నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. ఎంతగా హెచ్చరిస్తున్నా మాస్క్లు పెట్టుకోకపోవడం.. భౌతికదూరం పాటించకపోవడం వంటి పరిస్థితుల్లో మున్ముందు మరింత ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో చర్చించి లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. అత్యవసర సేవలు మినహాయిస్తే ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 20 గంటల పాటు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం లాక్డౌన్ను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. మరోపక్క లాక్ డౌన్ ప్రకటనతో.. నిత్యావసరాల కోసం జనం ఎగబడడంతో కూరగాయల మార్కెట్లు, ఇతర దుకాణాల వద్ద రద్దీ కన్పించింది.
వ్యాక్సినేషన్ వేగవంతానికి చర్యలు
జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయడంలో అధికార యంత్రాంగం సక్సెస్ అయ్యింది. లక్ష్యానికి మించి టీకాలు వేయగా.. ప్రస్తుతం రెండో డోసు తీసుకున్న వారికి ప్రాధాన్యత కల్పించి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే కూడా పూర్తయ్యింది. వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అంతం చేసేందుకు కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హెల్త్ కిట్లను ఇండ్ల వద్దనే అందజేశారు. మరోపక్క కరోనా పరీక్షలను సైతం పెద్ద ఎత్తున చేపడుతుండగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. భారీ స్థాయిలో వ్యాక్సిన్ను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుండగా.. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎంహెచ్వో, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో ఏర్పాటు చేసిన కమిటీ కరోనాపై ప్రతి రోజూ సమీక్షలు జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
వ్యవసాయం..అనుబంధ రంగాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు.
ఉపాధిహామీ పనులు, జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా సాగుతాయి. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ బంక్లు, బ్యాంక్లు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు కొనసాగుతాయి. మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. ఆయా వర్గాల వారికి ప్రత్యేక పాసులు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలన్నీ 33 శాతం సిబ్బందితో పని చేస్తాయి.
లాక్డౌన్ సడలింపు సమయంలో రేషన్ దుకాణాలు, నిత్యావసరాలతోపాటు అన్నిరకాల దుకాణాలు తెరిచే ఉండనున్నాయి.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఇతర రాష్ర్టాలకు బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
ముందస్తు అనుమతితో నిర్వహించే వివాహాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.
సినిమాహాళ్లు, క్లబ్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి ఉంటాయి.
లాక్డౌన్ నిర్ణయం మంచిదే..
కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ సార్.. లాక్డౌన్ విధిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ అవసరమే. లాక్డౌన్తో జన సముహం ఉండదు. కరోనా కేసులు తగ్గించడానికి లాక్డౌన్ ఒకటే మార్గం. ఈ పది రోజుల లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
ప్రభుత్వానికి సహకరించాలి
మండలంలోని కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా మినీ లాక్డౌన్ను విధించినప్పటికీ కొంత ఉపయోగం జరిగింది. ప్రభుత్వమే నేరుగా 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించడం ఎంతో సంతోషం. దీంతో పూర్తి స్థాయిలో కరోనా వైరస్ను నివారించే అవకాశం ఉంది. వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు చేసిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని లాక్డౌన్ పాటించి ప్రభుత్వానికి సహకరించాలి.
కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చు
కొవిడ్ రెండోదశ విజృభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం శుభపరిణామం. లాక్డౌన్ వల్ల 70శాతం కరోనా వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు ఇచ్చిన వెసులు బాటును సద్వినియోగం చేసుకోవాలి. దుకాణాల వద్ద గుమిగూడకుండా భౌతికదూరం పాటించాలి.
ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నది
ప్రభుత్వం సరైన సమయంలో లాక్డౌన్ విధిస్తూ సరైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్న కరోనా 2వ విడుతలో అన్ని గ్రామాలకు పాకింది. గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం 6నుంచి 10గంటల వరకు సడలింపు విధించి 10గంటల నుంచి లాక్డౌన్ అమలు చేస్తుండడంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనేందుకు అవకాశం ఏర్పడింది.
నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ప్రభుత్వం లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నాం. ఎంతో మంది కరోనా వ్యాధికి గురైనప్పటికీ ఇష్టానుసారంగా బయట తిరుగతూ ఇతరులకు వ్యాధి అంటిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తే ఎవ్వరూ బయటకు రారు. వ్యాధి వచ్చిన వారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే కరోనా విజృంభిస్తుంది. లాక్డౌన్ విధించడం వల్ల తప్పనిసరిగా కరోనా కేసులు తగ్గుతాయి. ప్రజలు కూడా సహకరించాలి.