యాదాద్రి భువనగిరి, జూన్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. కొవిడ్ కట్టడి కావడంతో ఇక లాక్డౌన్ను పొడిగించకుండా సీఎం కేసీఆర్ శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పకడ్బందీగా లాక్డౌన్ను అమలు చేయడం.. ఇంటింటి జ్వర సర్వే ద్వారా కరోనా రోగులను ముందుగానే గుర్తించి సత్వర వైద్య సాయం అందించడంతో జిల్లాలో మొదటి నుంచీ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నది. పాజిటివ్ రేట్ సైతం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి అన్నీ ఓపెన్ అయి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. జూలై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు సైతం తెరుచుకోనున్నాయి.
జిల్లాలో కరోనా అదుపులోకి వచ్చింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. పాజివిటీ రేట్ను నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం సూపర్ సక్సెస్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేసినప్పటి నుంచీ జిల్లాలో పోలీస్శాఖ పక్కాగా లాక్డౌన్ను అమలు చేసింది. లాక్డౌన్తో ఓవైపు కేసులను కట్టడి చేస్తూనే..మరోపక్క ఇంటింటి సర్వేతో కరోనా వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నిర్ధారణ పరీక్షలను పెంచడం..ఇంటికే వెళ్లి హెల్త్ కిట్లను వైద్యారోగ్య శాఖ అధికారులు బాధితులకు అందజేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ జిల్లాలోనే వైద్యం అందించేలా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లను అందుబాటులో ఉంచడంతోపాటు ఆక్సిజన్, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. దశలవారీగా లాక్డౌన్ పొడిగిస్తూ..కేసులు క్రమంగా తగ్గుతున్న తరుణంలో ఆంక్షలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో..అందుకనుగుణంగా జిల్లాలోనూ కార్యాచరణను అమలు చేశారు.
నేటి నుంచి ఇవన్నీ ఓపెన్
జిల్లాలో లాక్డౌన్ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి అన్నీ ఓపెన్ కానున్నాయి. లాక్డౌన్లో మూసివేతకు గురైన సినిమా థియేటర్లు, బార్లు, పార్కులు, రెస్టారెంట్లు పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. అన్ని కార్యాలయాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. జూలై 1 నుంచి అన్ని విద్యాసంస్థలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో గత ఏడాది కాలంగా మూతబడ్డ పాఠశాలలను తెరిచేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్డౌన్ను ఎత్తివేసినప్పటికీ కొవిడ్ నిబంధనలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ను ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని వారు పేర్కొంటున్నారు.