సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 17 : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి తులసి దుర్గారాణి అన్నారు. మండలంలోని గుడిమల్కాపురం, అల్లందేవి చెరువు, పల్లగట్టు తండా గ్రామాల్లో ఆదివారం ఉచిత న్యాయ సలహాలు, సూచనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కోర్టుకు వచ్చి న్యాయం కోసం పోరాడే స్థోమత లేదన్నారు. పేదలు మండల లీగల్ సర్వీసెస్ కమిటీని ఆశ్రయిస్తే న్యాయం పొందే అవకాశం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకుంటే దొంగతనాలు, నేరాలు, హింస తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాల్యం చలపతి, తాడూరి పరమేశ్, సర్పంచులు మన్నె పుష్పలత, సురి యాదయ్య గౌడ్, విజయకిషన్, సీఐ వెంకటయ్య, పారా లీగల్ లాయర్ రవీందర్, ఆర్ఐ నగేశ్, రాఘవ, శివ గౌడ్ పాల్గొన్నారు.
న్యాయ సేవలపై అవగాహన
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని దండు మల్కాపురం, తూప్రాన్పేట గ్రామాల్లో న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దుర్గారాణి వివిధ చట్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, తాసీల్దార్ గిరిధర్, సర్పంచులు ఎలువర్తి యాదగిరి, చక్రం జంగయ్య, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ పాల్గొన్నారు.
నేడు జూనియర్ కోర్టు జడ్జిగా నాగరాజు బాధ్యతలు
చౌటుప్పల్, అక్టోబర్ 17 : చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రామన్నపేట కోర్టు జడ్జి దుర్గారాణి ఇక్కడ ఇన్చార్జి జడ్జిగా పనిచేశారు. పూర్తి స్థాయి జడ్జిగా నాగరాజు పనిచేయనున్నారు. నాగరాజు ఇప్పటి వరకు మేడ్చల్ జడ్జిగా పనిచేసి బదిలీపై ఇక్కడి వచ్చారు. జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్న నాగరాజుకు ఘన స్వాగతం పలుకుతామని బార్ అసోసియేషన్ ప్రతినిధులు బాల్యం వెంకటాచలపతి, ఊడుగు శ్రీనివాస్గౌడ్, తాడూరి పరమేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.