భూదాన్పోచంపల్లి, జూన్ 8: పల్లెసీమల అభివృద్ధితోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో గ్రామాల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించింది. మండలంలోని ధర్మారెడ్డిపల్లి గతంలో వంకమామిడి ఆవాస గ్రామంగా ఉండేది. తెలంగాణ సర్కారు 500 ఓటర్లు ఉన్న గ్రామాలను నూతన గ్రామ పంచాయతీగా మార్చివేస్తున్న తరుణంలో ఈ గ్రామం సల్లోనిగూడెం ఆవాస గ్రామంతో కలిపి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది.అంతే కాదు నూతనంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సల్లోనిగూడెంకు చెందిన సామ రవీందర్రెడ్డిని ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామ జనాభా 815 కాగా 664 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో వేరే గ్రామ పంచాయతీలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా అన్ని రకాలుగా వెనుబడిపోగా తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాలతోపాటు పల్లె ప్రగతి కారణంగా ముందంజలో నడుస్తోంది. ఇప్పటి వరకు గ్రామంలో కోటి 7 లక్షల అభివృద్ధి పనులు జరిగాయి.
అభివృద్ధి పరుగులు
సామ రవీందర్రెడ్డి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాటి నుంచి గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. తక్కువ సమయంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో సుమారు రూ. 73 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ తన సొంత నిధులతో గ్రామానికి ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో రూ. 12 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. రూ. 2 లక్షల 52 వేలతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. రూ. 15 లక్షలతో పాత బావుల పూడ్చివేతతోపాటు గ్రామ పంచాయతీ, స్కూల్, కమ్యునిటీహాల్ భవనాలకు మరమ్మతులు చేయించారు.
రూ. 73 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
గతంలో గ్రామంలో బురద రోడ్లు ఉండేది. పల్లె ప్రగతితోనే కాకుండా ఇతర నిధుల ద్వారా సుమారు రూ. 73 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసి మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. హెచ్ఎండీఏ నుంచి రూ. 20 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ. 20 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ. 18 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. ఇంకా రూ. 10 లక్షల హెచ్ఎండీఏ నిధులు, రూ. 3 లక్షల మండల కోఆప్షన్నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనం ద్వారా మొక్కలు నాటారు. హరితహారంలో సుమారు 10 వేల మొక్కలు నాటించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఫలాలు గ్రామానికి చేరువయ్యాయి. ప్రజలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో తాగునీటి ఎద్దడిని తీర్చటానికి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడంతోపాటు గ్రామస్తులకు తడిపొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. కోటి 7 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా గ్రామ పంచాయతీ భవనం నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. హరితహారంలో నాటిన మొక్కలు గ్రామానికి అందాన్ని ఇస్తున్నాయి.
-సామ రవీందర్రెడ్డి, సర్పంచ్ ధర్మారెడ్డిపల్లి
ఎన్నడూ రాని నిధులు వచ్చాయి
మా గ్రామం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. సర్పంచ్ రవీందర్రెడ్డి ఎక్కువ నిధులు తీసుకువచ్చారు. ప్రభుత్వం కూడా వెనుకబడిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇప్పటికీ గ్రామానికి రూ. కోటి నిధులు రావడం ఆనందంగా ఉంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డికి రుణపడి ఉంటాం.
-సామ జంగారెడ్డి, ధర్మారెడ్డిపల్లి