Medigadda Barrage | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా. కమీషన్ల కోసమే కట్టారు. రూ.లక్ష కోట్లు వృథా. అంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు’- ఇవీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు పదే పదే చేసిన విమర్శలు. ఒకవైపు పంటలు ఎండిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తుంటే, ప్రాజెక్టులు అడుగంటడానికి, కాలువలు పారకపోవడానికి మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగడమే కారణమని ఇప్పుడు చెప్తున్నారు. ఆ నిందను మళ్లీ కేసీఆర్పైనే మోపి తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారుకు అవగాహన ఉన్నదా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారానే పంటలు పండుతున్నాయనేది సత్యమైతే, పునరుద్ధరణ పనులు ఎందుకు చేపట్టడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతి జరిగిందంటూ ఏకకాలంలో వివిధ మార్గాల్లో విచారణలు చేయిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ అంశాన్ని గాలికి వదిలేసింది. ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టింది. నివేదిక వస్తే తప్ప ఏ చిన్న అడుగు వేయబోమంటూ భీష్మించుకుని కూర్చున్నది. తాత్కాలిక మరమ్మతులకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరి, చేతులు దులుపుకున్నదే తప్ప ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది వానలు ముందే కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సూచిస్తున్నా, కనీస ఎమర్జెన్సీ పనులను సైతం చేపట్టడం లేదు. ఎన్డీఎస్ఏ సైతం అదే తీరుగా వ్యవహరిస్తున్నది. బరాజ్ కుంగుబాటు తరువాత రెండు రోజుల్లోనే నివేదిక విడుదల చేసిన అథారిటీ, ఇక ఆ తరువాత విచారణలతోనే కాలం గడుపుతున్నది తప్ప రాష్ర్టానికి మరే సమాచారమూ ఇవ్వడం లేదు. ఎన్డీఎస్ఏ తీరుపై ఇంజినీరింగ్ అధికారులు, సర్కారు వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటునకు గురైన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆది నుంచీ అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నది. విచారణ చేయకముందే డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు అంటూ నానా రచ్చ చేసింది. మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ప్రాజెక్టును సందర్శించి అక్కడా అవే ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు ఒకవైపు విజిలెన్స్ ఎంక్వయిరీకి, మరోవైపు జ్యూడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు. ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరమే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేపడతామంటూ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులను, తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోతే వాటిల్లే ఇబ్బందులను ఎన్డీఎస్ఏకు వివరించి నివేదికను తెప్పించుకునే ప్రయత్నమే చేయకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనం.
మేడిగడ్డ బరాజ్ వద్ద కుంగుబాటును సరిచేసి, శాశ్వత మరమ్మతులను డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు చేయాల్సి ఉంటుంది. రాబోయే వానకాలం దృష్ట్యా, పిల్లర్ వద్ద ఏర్పడిన కుంగుబాటు మరింత విస్తరించకుండా ఉండేందుకు అవసరమైన మేరకు తాత్కాలిక, తక్షణ చర్యలను చేపట్టాల్సి ఉన్నది. అన్ని బరాజ్ల్లో రాఫ్ట్ కిందనున్న రంధ్రాలను గుర్తించి వాటిని మూసివేయడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ఓఅండ్ఎం పనులను ఐఎస్ కోడ్ ప్రకారం చేపట్టేందుకు నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించడం, బరాజ్ల ఎగువన, దిగువన వాటర్ప్రూఫ్ కోసం సిమెంట్ గ్రౌటింగ్ చేపట్టడం, ప్రవాహాలకు ఆటంకంగా మారే రాళ్లను తొలగించడం, మేడిగడ్డలో బ్లాక్ 7లో జామ్ అయిన గేట్లను తొలగించడం, స్టీల్షీట్పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయడం, బరాజ్లపై వరద ఒత్తిడిని తగ్గించేందుకు ఎగువ భాగంలో నదిపై రెగ్యులేటరీలు నిర్మించడం, బరాజ్ల ఎగువ, దిగువన నదీ గర్భంలోని ఇసుక మేటలను ఇరిగేషన్శాఖ పర్యవేక్షణలో తొలగించడం తదితర పనులను నిర్వహించాల్సి ఉన్నది. ఆయా అంశాలనే ప్రభుత్వం సైతం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి వివరించింది. అక్కడితోనే ప్రభుత్వం చేతులు దులుపుకున్నది తప్ప ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదికను తెప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమేదీ ఇప్పటివరకు కనిపించడం లేదు. నివేదిక ఇస్తే తప్ప పూచికపుల్ల పనిని కూడా చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్తున్నది.
మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ అక్టోబర్ 21న కుంగుబాటుకు గురైన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం, ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్తోసహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఆ బృందం అక్టోబర్ 23న రాష్ర్టానికి వచ్చింది. 24న మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది. అదే నెల 25న రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైంది. మరో 20 సాంకేతిక అంశాలపై సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వకముందే, అక్టోబర్ 29 నాటికే కాళేశ్వరం బరాజ్ ఘటనపై ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఎలాంటి పరీక్షలు, పరిశోధనలు చేయకుండా, కేవలం క్షేత్రస్థాయి సందర్శన ద్వారానే బరాజ్ కుంగుబాటుకు డిజైన్, నాణ్యత లోపాలు కారణమంటూ ఎన్డీఎస్ఏ ప్రకటించింది. ఆ తరువాత మార్చి వరకు ఎన్డీఎస్ఏ మళ్లీ స్పందించింది లేదు. అంతర్జాతీయ నిపుణులతో కమిటీని ఏర్పాటుచేసుకోవాలని, పరిశీలనలు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చింది తప్ప పూర్తిస్థాయి విచారణ చేపట్టి, పునరుద్ధరణ చర్యలకు సిఫారసు చేసేందుకు మాత్రం ముందుకురాలేదు. ఎట్టకేలకు గత మార్చి 3న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ నియమించింది. నివేదిక సమర్పణకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఆ కమిటీ తొలుత మార్చి 7,8,9 తేదీల్లో విచారణ చేసింది. ఆ తరువాత మార్చి 20,21,22 తేదీల్లో మరోసారి విచారణ నిర్వహించింది. కానీ ఇప్పటికీ తక్షణ, తాత్కాలిక చర్యలకు సంబంధించి ఎలాంటి సిఫారసులు చేయలేదు.
ఎన్డీఎస్ఏ సిఫారసులు చేసిన తరువాతనే తక్షణ మరమ్మతులు చేపడతామంటూ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడంపై ఇంజినీరింగ్ అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్డీఎస్ఏ కమిటీనే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదని, అందులో ఉన్నవారందరూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారేనని చెప్తున్నారు. సీడబ్ల్యూసీలో ఇంజినీర్ల కొరత ఉన్నదని, పని ఒత్తిడితో వారే సతమతమవుతున్నారని, ఇప్పటికిప్పుడు అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. ఎన్డీఎస్ఏలోని అధికారులకు భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్న క్షేత్రస్థాయి అనుభవమే లేదని స్పష్టంచేస్తున్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ ఉదాసీనతను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రాజెక్టుల్లో లోపాలు సహజమని వాటిని విచారించి చర్యలు తీసుకోవడంతోపాటు పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని వివరిస్తున్నారు. వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో రైతాంగంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లేని లోటును గోదావరి బేసిన్లోని రైతులు స్వయంగా అనుభవిస్తున్నారు. నిరుడు యాసంగి సీజన్లో పచ్చగా కళకళలాడిన పంటపొలాలు ఈ ఏడాది యాసంగిలో ఎండిపోయి పశువులకు మేతగా మారడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా, రాజకీయాలకే పరిమితం కావడంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల కొందరు రైతులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించుకునైనా ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టుకుందామని పిలుపునిస్తుండటం గమనార్హం. ఇకనైనా రాజకీయాలు మానుకుని జాతి సంపదను కాపాడాలని, వచ్చే సీజన్కైనా ప్రాజెక్టును అందబాటులోకి తీసుకొచ్చే విషయంపై దృష్టి సారించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.