భువనగిరి అర్బన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. దగ్గు, జలుబు, టెంపర్రేచర్ ఎక్కువ ఉన్నవారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 పరీక్ష కేంద్రాల్లో 7,523 మంది హాజరుకావాల్సి ఉండగా 6,865 మంది హాజరయ్యారు. 658 మంది గైర్వాజరయ్యారు. మొత్తం 91.25శాతం నమోదైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి.సంజీవ తెలిపారు.
నిమిషం ఆలస్యం నిబంధనలకు తూట్లు..
సంస్థాన్ నారాయణపురం : ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పిన విషయం విదితమే. కానీ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాల సిబ్బంది. సోమవారం సమయం దాటిపోయినా 8 మంది విద్యార్థులను విడుతల వారీగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. సమయం దాటినా అనుమతిస్తే నిబంధనలు పెట్టడం ఎందుకని విద్యార్థుల్లో చర్చనీయాంశమైంది.