వర్ధన్నపేట, మే 7: బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, అభ్యర్థి సుధీర్కుమార్తో కలిసి వర్ధన్నపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందడంతో సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు, సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.
హనుమకొండ, మే 7: బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతున్నది. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయానికి నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ పార్లమెట్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ను కలిసి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రచారం చేస్తామని కొందరు, కొన్నివర్గాల మద్దతు పత్రాలు అందజేస్తున్నారు.