స్వరాష్ట్రంలో పరకాల నియోజకవర్గం ప్రగతి పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో 1200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. దీనిలో రూ.800 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రూ.38 కోట్లతో కోనాయిమాకులలో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగిషన్ ప్రాజెక్టుతో 1,100 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దామెర మండలం సింగరాజుపల్లిలో 40 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో రోజుకు 34 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పరకాల పట్టణంలో రూ.ఐదున్నర కోట్లతో రెవెన్యూ డివిజన్, తహసీల్ కార్యాలయాలు, రూ.35 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో గంగదేవిపల్లి, మరియపురం, నడికూడ, వరికోల్ గ్రామాలను పలు పురస్కారాలు వరించాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నాయి.
పరకాల, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్ తిరిగి వచ్చింది. నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. దామెర, నడికూడ కేంద్రాలుగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేయగా పాలన ప్రజలకు చేరువైంది. నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో పాలన భవనాల నిర్మాణాలు తుది దశకు చేరగా.. పరకాల ప్రాంత చిరకాల వాంఛ అయిన 100 పడకల దవాఖాన నిర్మాణం శర వేగంగా కొనసాగుతోంది. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, క్లస్టర్లలో రైతు వేదిక భవనాలు, పల్లెల్లో లింక్ రోడ్లు, అంతర్గత రోడ్లతో గ్రామాలన్నీ ప్రగతి బాటలో నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ పాలనలో చెరువులు నిండు కుండగా కనువిందు చేస్తుంటే… పల్లెల్లో వ్యవసాయ భూములన్నీ పచ్చని రంగేసినట్లు పంటలతో కళకళలాడుతున్నాయి.
నడికూడ, దామెర మండలాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నూతన మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు పాలన చేరువైంది. నియోజకవర్గ వ్యాప్తంగా నడికూడ, దామెర కేంద్రాలుగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో పాటు 21తండాలను, శివారు గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. 14 గ్రామాలతో దామెర మండలాన్ని, 15 గ్రామాలతో నడికూడను నూతన మండలాలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో తహసీల్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలను సిద్ధం చేసి పాలనాధికారును నియమించారు. దామెర మండల కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్, పీహెచ్సీలను నెలకొల్పారు.
పల్లె ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు
గ్రామాల రూపురేఖలు మారాయి. దీంతో పల్లెల్లో పట్టణ వాతావరణాన్ని సంతరించుకకున్నాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంతేకాకుండా వందల కోట్ల రూపాయల నిధులతో గ్రామ గ్రామానికి లింక్ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 24రైతు వేదిక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచడంతో గ్రామాల్లో పారిశుద్య నిర్వహణ మెరుగుపడి పల్లెలు స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. దీంతో సీజన్ వ్యాధుల వ్యాప్తి తగ్గింది. గ్రామ ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండడంతో సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కారమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రజలకు మెరుగైన వసతులు కల్పించారు.
ఉపాధికి కేంద్ర బిందువు..
నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఉపాధికి కేంద్ర బిందువుగా నిలువనుంది. ఇప్పటికే టెక్స్టైల్ పార్కులో గణేశా ఎకోటెక్, ఎకోపెట్ పరిశ్రమలను నెలకొల్పింది. వీటిలో ఉత్పత్తిని మంత్రి కేటీఆర్ ప్రారంభించగా కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమల స్థాపనకు భూమి పూజ చేసింది. ఈ కంపెనీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీలు పరిశ్రమల నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవ్వగా మరికొన్ని కంపెనీలు టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి. కాగా, టెక్స్టైల్ పార్కులో పలు పరిశ్రమల నిర్మాణాలు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే నియోజకవర్గం ఉపాధికి కేంద్ర బిందువుగా మారుతుంది.
అభివృద్ధి పథంలో పరకాల మున్సిపాలిటీ
తెలంగాణ రాష్ట్రంలో పరకాల పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. దీంతో పట్టణం నలు వైపులా విస్తరిస్తోంది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి రెండు విడుతలుగా 40 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేకాకుండా వెల్లంపల్లి రోడ్డులో 7.5కోట్ల రూపాయలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్వెజ్ మార్కెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వసతులతో నిర్మించిన నూతన మున్సిపాలిటీ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ శివారులో కోటి రూపాయలతో స్మశాన వాటిన నిర్మాణాన్ని చేపట్టారు.
సింగరాజుపల్లిలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 34మిలియన్ లీటర్ల నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తున్నారు. దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో 40మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నించి పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
లక్ష చదరపు అడుగుల్లో 100 పడకల దవాఖాన నిర్మాణం
పరకాల-హనుమకొండ ప్రధాన రహదారిపై పట్టణ శివారులో నూతనంగా 100 పడకల దవాఖాన నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు, నిర్వహణకు 7.88 కోట్లు కేటాయించింది. కాగా, ఆస్పత్రిని మూడు అంతస్తుల్లో లక్ష చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. పనులు పూర్తయితే వైద్యం కోసం వచ్చే రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. ప్రస్తుతం పరకాలలో సివిల్ ఆస్పత్రిలో 30 పడకలు మాత్రమే అందుబాటులో ఉండడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని హనుమకొండ, వరంగల్కు తరలిస్తున్నారు.
కార్పొరేట్ తరహా పాలనా భవనాలు
నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాలన భవనాలను కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్నారు. పరకాల మండల కేంద్రంలో ఐదున్నర కోట్ల రూపాయలతో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, తహసీల్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో పాటు దామెర, నడికూడ మండల కేంద్రాల్లో తహసీల్, మండల పరిషత్ కార్యాలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానాలకు భవనాలను నిర్మిస్తున్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు..
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో పరకాల నియోజకవర్గం ముందంజలో నిలిచిం ది. పరకాల, నడికూడ, సంగెం, ఆత్మకూరు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేసింది. పరకాల మండలంలోని వెల్లంపల్లి, నడికూడ మండలంలోని చర్లపల్లి, వరికోల్, ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్, కటాక్షపూర్, సంగెం మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరింది.
రూ.800 కోట్లతో మెగా టెక్స్టైల్ పార్కులో వసతులు
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పరకాల నియోజవర్గానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని గీసుగొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల శివారులో 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నెలకొల్పింది. కాగా, టెక్స్టైల్ పార్కులో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తిని కనబరుస్తుండడంతో మౌలిక వసతులు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తును నిధులును మంజూరు చేసింది. ఇప్పటికే సుమారు 800 కోట్ల రూపాయ లు మంజూరు చేసింది. ఇందులో రూ.450 కోట్లతో అంతర్గత రహదారులు, సెం టల్ లైటింగ్, డ్రైనేజీ, 33/11కేవీ సబ్ స్టేషన్ను నిర్మించింది. అంతే కాకుండా కంపెనీలకు అవసరమయ్యే నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. రూ.178 కోట్లతో 220కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం, రూ.100 కోట్లతో పార్కుకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు పనులు చేపట్టారు. రూ.83 కోట్లతో వ్యర్థ జలాల ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు.
రెవెన్యూ డివిజన్తో పరకాల ప్రజల కల సాకారం
తెలంగాణ రాష్ట్రంలో పరకాల ప్రాంత ప్రజల కల సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పరకాల రెవెన్యూ డివిజన్గా కొనసాగేది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పాలకుల కుట్రలు చేసి పరకాల నుంచి రెవెన్యూ డివిజన్ను రాత్రికి రాత్రే ములుగుకు తరలించారు. దీంతో పరకాల వెనుకబాటును గుర్తించిన సీఎం కేసీఆర్ పరకాలను రెవెన్యూ డివిజన్గా 2018లో ప్రకటించారు.
రూ.38 కోట్లతో కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్
గీసుకొండ మండల కోనాయిమాకుల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో పరకాల నియోజవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలతో పాటు నర్సంపేట మండలంలోని దుగ్గొండి గ్రామాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో భాగంగా ఎస్సీరెస్పీ ప్రధాన కాల్వ నుంచి నీటిని ఎత్తి పోసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పనులు పూర్తయితే ఆయా మండలాల్లో 1100 ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందనుంది.
డబుల్ రోడ్లు, హైలెవల్ వంతెనల నిర్మాణం
నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, రవాణా వ్యవస్థ మెరుగుపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించింది. ప్రతి మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను నిర్మించింది. అంతే కాకుండాలో లెవల్ వంతెనలతో వర్షాకాలంలో పలు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి హైలెవల్ వంతెనలను నిర్మించింది. ఆత్మకూరు మండలం నుంచి అక్కంపేట మీదుగా ఎనుమాముల గ్రేయిన్ మార్కె ట్ వరకు 56.5 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు పనులను పూర్తి చేశారు.
రూ.8.5 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం
నియోజకవర్గ వ్యాప్తంగా పరకాల, నడికూడ, ఆత్మకూరు మండలాల్లో చెక్ డ్యాంలను నిర్మించారు. చలివాగుపై పరకాల పట్టణం లక్ష్మీపురం, నడికూడ మండలం నార్లాపూర్ గ్రామాల వద్ద 8.5 కోట్ల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణాలు పూర్తి చేశారు. దీంతో నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో చెక్డ్యాం నిర్మాణం చేపట్టగా, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామ శివారులో చలివాగు, జేరుపోతుల వాగు వద్ద చెక్ డ్యాంలను నాలుగు కోట్ల రూపాయల నిధులతో నిర్మించారు. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను కాళేశ్వరం నీటితో నింపడంతో ఎండాకాలంలో సైతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..
రాష్ట్ర ప్రభుత్వ కృషితో పలు గ్రామాలు అభివృద్ధి పథంలో నిలుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయి. గీసుగొండ మండలం గంగదేవిపల్లి, మరియపురం, నడికూడ మండలం వరికోల్ గ్రామం ఉత్తమమైన పని తీరు కనబరిచాయి.