కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 12 : ఏ ధైర్యంతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టుల రద్దు అంశాన్ని ఎజెండాలో చేర్చుతారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే జీఆర్ఎంబీలో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చుతుంటే రాష్ట్ర ప్రభు త్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. బోర్డు సమావేశ ఎజెండాల్లో ఏపీ సీఎం చంద్రబాబు అనుమతులు రద్దు చేయాలని అడిగితేనే ప్రధాని మోదీ చేర్చారని ఆరోపించారు. బుధవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి అనుమతులను సాధించి కాళేశ్వరం, సమ్మక్క సారలక్క, సీతారామ, ఎల్లంపల్లి, ప్రాజెక్టులను నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించి ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని సూచించారు. 75 సార్లు ఢిల్లీ ప్రయాణం చేసిన రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్ తెలంగాణ కోసం 76వ సారి ఢిల్లీ వెళ్లి ఎజెండాల్లో ఈ అంశం లేకుండా చూడాలని సూచించారు.
జీఆర్ఎంబీ సమావేశాన్ని ముట్టడిస్తాం: గంగుల
జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల రద్దు అంశాన్ని తొలగించకపోతే సమావేశ ప్రాంతాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఈ అంశంపై నిలదీయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీరిని తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ప్రాజెక్టులను సాధించారని, బీఆర్ఎస్పై కోపంతో రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేయవద్దని చెప్పారు.