హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ప్రత్యేకంగా చైర్మన్ను నియమించడంపై అంతర్గతంగా తీవ్ర దుమారం రేగుతున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వర్తిస్తున్న బాధ్యతలను పదవీ విరమణ చేసిన అధికారికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేందనే చర్చ జోరుగా సాగుతున్నది. పీసీబీ చైర్మన్గా రాజశేఖర్రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాకాలం వరకు ఉండేవిధంగా కేవలం మూడేండ్లకు మాత్రమే నియమించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉండటంతో మెంబర్ సెక్రటరీ అన్ని బాధ్యతలు నిర్వర్తించేవారు.
ఉద్యోగుల పరిపాలన, బదిలీలతోపాటు అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను మెంబర్ సెక్రటరీ చూసుకునేవారు. పరిశ్రమల తనిఖీలు, నూతన పరిశ్రమల అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులకు సంబంధించిన అన్ని విషయాలు మెంబర్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారుల పరిధిలో జరిగేవి. ఉన్నతస్థాయి నిర్ణయాలు మాత్రం చైర్మన్గా ఉన్న సీఎస్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేక అధికారి చైర్మన్గా రావడంతో అన్ని బాధ్యతలు ఆయన కనుసన్నల్లోనే జరిగే అవకాశం ఉన్నది. మెంబర్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారుల పాత్ర నామమాత్రంగానే ఉండనుండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ఐఆర్ఎస్ క్యాడర్ అధికారిని చైర్మన్గా నియమించడంపై అసంతృప్తితో సెలవుపై వెళ్లేందుకు మెంబర్ సెక్రటరీ సిద్ధమైనట్టు ఈ మేరకు విశ్వసనీయంగా తెలిసింది.
కాలుష్య నియంత్రణ మండలికి చైర్మన్గా ప్రత్యేక అధికారిని నియమించడం వెనుక ప్రభుత్వ ‘పెద్దలు’ భారీ స్కెచ్ వేసినట్టు సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పీసీబీని అడ్డుపెట్టుకుని భారీగా నిధులు మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే విధుల్లో చేరిన వెంటనే చైర్మన్ ఏయే సెక్షన్లో ఎవరు ఉన్నతాధికారులుగా ఉన్నారు? నిధుల సమీకరణ, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారని వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
పీసీబీకి రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నది? పరిశ్రమల అనుమతులు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టే కార్యక్రమాల రాబడి, వ్యయం ఏవిధంగా నిర్వహిస్తారు? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల సేకరణ వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో మిగులు బడ్జెట్లో ఉన్న పీసీబీని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేసేందుకు ప్లాన్ వేసిందని ఉద్యోగులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిధుల మళ్లింపునకు ప్రభుత్వ ముఖ్యనేత ఆధ్వర్యంలోనే ప్లాన్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటిదాకా ఆదాయ వనరుగా ఉన్న పీసీబీ లోటు బడ్జెట్కు చేరుకుని అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.