ఊట్కూర్, సెప్టెంబర్ 18 : పత్తి ధరలను తగ్గించడంపై నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని విజయ్కాటన్ మిల్ ఎదుట రోడ్డుపై శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గురువారం క్వింటాకు గరిష్ఠంగా రూ.9,500 ధర పలుకగా శుక్రవారం రూ.200 తగ్గించి రూ.9,300కు కోనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా పడిపోయిందని వాపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించకుండా రోజుకో ధర నిర్ణయించడం రైతులను మరింత అప్పులోకి నెడుతోందని ఆరోపించారు. ఊట్కూర్ ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మిల్లు యజమానులతో చర్చించిన అనంతరం పత్తి ధరలను పెంచుతామని వారు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.