ఖైరతాబాద్, సెప్టెంబర్ 18: ఖమ్మం జిల్లాలో లైంగికదాడికి గురైన బాలిక నిమ్స్ లో చికత్స పొందుతుండగా, నిందితుడి కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జూన్ 6న లైంగికదాడికి గురై తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను నిమ్స్లో చేర్పించగా, 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ ఠాణాలో నిందితుడు మహ్మద్గౌస్(49)పై పోక్సోతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఈ నెల 16న బాలిక కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. ఈ నెల 16న సాయంత్రం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు బాలిక ఉన్న వార్డుకొచ్చి మహ్మద్గౌస్కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు. బాలిక తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది గౌస్ కుమార్తెలు మహ్మ ద్ ఆస్మా, మహ్మద్ ఆఫ్రిన్తోపాటు అతని కోడలుగా గుర్తించి, కేసు నమోదు చేశారు.